రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ABN , First Publish Date - 2023-02-06T23:58:10+05:30 IST
లగ్న పత్రిక రాయించుకొని ఆటోలో సొంతూళ్లకు వెళ్తున్న వారిని ఎదురుగా ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురిని బలి తీసుకుంది.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆటోను ఢీకొన్న పత్తి ట్రాక్టర్
లగ్న పత్రిక రాయించుకొని వెళ్తుండగా మృత్యువాత
ఆమనగల్లు/మాడ్గుల, ఫిబ్రవరి 6: లగ్న పత్రిక రాయించుకొని ఆటోలో సొంతూళ్లకు వెళ్తున్న వారిని ఎదురుగా ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురిని బలి తీసుకుంది. మాడ్గుల మండలం చంద్రాయనపల్లి సమీపంలో ఆమనగల్లు-చారగొండ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం కలకొండ పంచాయతీ సండ్రలగడ్డ తండాకు చెందిన నెనావత్ పత్యానాయక్(40), నెనావత్ అభిరాం(2), బిక్కునాయక్, శారద.. ఆమనగల్లు మండలం నుచ్చుగుంట తండాకు చెందిన వర్త్యావత్ శాంతి(45)లు ఆమనగల్లు తండాలోని తమ బంధువు లగ్న పత్రిక పెట్టుకునేందుకు ఆటోలో వచ్చారు. లగ్న పత్రిక రాయించుకొని తిరిగి ఆటోలో సండ్రలగడ్డ తండాకు వెళ్తుండగా చంద్రాయిన్పల్లి సమీపంలో ఎదురుగా పత్తిలోడ్ ట్రాక్టర్ వారి ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న శాంతి, పత్య అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో శాంతి తల తెగిపోయింది. గాయపడిన అభిరాం, బిక్కునాయక్, శారదలను ఆమనగల్లులోని ఆస్పత్రులకు తరలిస్తుండగా మార్గమధ్యలో అభిరాం అనే చిన్నారి మృతిచెందాడు. బిక్కు, శారదలకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఘటనాస్థలాన్ని సీఐ కృష్ణమోహన్ పరిశీలించి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లివస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం సండ్రలగడ్డ, నుచ్చుగుట్ట తండాల్లో విషాదాన్ని నింపింది. ఘటనాస్థలం వద్ద, ఆమనగల్లు ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు కలచివేశాయి.