బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2023-01-25T00:19:23+05:30 IST
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు పొనుగోటి అంజన్రావు అన్నారు.
ఆదిభట్ల, జనవరి 24: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు పొనుగోటి అంజన్రావు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవికుమార్, మండల విద్యాధికారి వెంకట్రెడ్డిలతో కలిసి ఆదిభట్ల మున్సిపాలిటి పరిధిలోని బొంగ్లూరు మోడల్ స్కూల్ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు దేశం యొక్క విలువైన సంపద అని అన్నారు. వారి హక్కుల పరిరక్షణ ప్రతివ్యక్తి కనీస బాధ్యతగా గుర్తించాలన్నారు. బాలల కోసం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వివరించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆహారం, విద్య, వైద్యం పొందడం రాజ్యాంగం ద్వారా బాలలకు సంక్రమించిన ప్రాథమిక హక్కు అన్నారు. బాలల సంరక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడానికి సమర్థవంతమైన వ్యవస్థలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల బాలలపై దాడులు జరుగుతున్న తీరుపట్ల విచారం వ్యక్తం చేశారు. బాలబాలికలు ఏమైనా ఇబ్బందులు ఉంటే 1098 టోల్ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలని సూచించారు. తాగునీటి సమస్య ఉన్నట్లు విద్యార్థులు వారి దృష్టికి తేవడంతో పరిష్కరించాలని అక్కడే ఉన్న డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.