కంటైనర్ ఢీకొని హోంగార్డు మృతి
ABN , First Publish Date - 2023-01-25T23:46:51+05:30 IST
వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ హోంగార్డును కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన చనిపోయారు. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ కూడలి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం జరిగింది.
వాహనాలను తనిఖీ చేస్తుండగా ప్రమాదం
మేడ్చల్ మండలం కండ్లకోయ వద్ద ఘటన
మేడ్చల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ హోంగార్డును కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన చనిపోయారు. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ కూడలి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటే్షతో కలిసి కానిస్టేబుల్ రాంచందర్, హోంగార్డు శ్రీనివా్సలు కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ వైపు నుంచి కొంపల్లి వైపు వెళుతున్న ఓ కంటైనర్(ఎంహెచ్ 04జీఈ 1764)ను ఆపాలని శ్రీనివాస్ చేతితో సైగ చేశారు. డ్రైవర్ వాహనాన్ని పక్కకు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు శ్రీనివా్సను ఢీకొట్టింది. దీంతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఎస్ఐ, సిబ్బంది శ్రీనివా్సను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. శ్రీనివా్సది వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని చాపలగూడెం. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలతో కలిసి మేడ్చల్లో ఉంటున్నారు. కంటైనర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. శ్రీనివాస్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పేట్బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరాజు, సీఐ రాజశేఖర్రెడ్డిలు సందర్శించి దర్యాప్తు చేపట్టారు.