అందరికీ ఇళ్లు కట్టిస్తాం

ABN , First Publish Date - 2023-01-25T00:51:46+05:30 IST

అందరికీ ఇళ్ళు కట్టిస్తాం.. స్థలాలు పోయిన వారి కి మరోచోట స్థలాలు ఇస్తామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ అన్నారు. సీఎం దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో గ్రామ పునర్నిర్మాణంపై గ్రామ సభ మంగళవారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత గ్రామంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనుల పై ప్రజలకు వివరించారు.

అందరికీ ఇళ్లు కట్టిస్తాం

స్థలాలు ఇచ్చిన వారికి మరోచోట స్థలాలు

అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ

గ్రామస్థులంతా అంగీకారం తెలుపుతూ తీర్మానాలు ఇవ్వండి

తుర్కపల్లి, జనవరి 24: అందరికీ ఇళ్ళు కట్టిస్తాం.. స్థలాలు పోయిన వారి కి మరోచోట స్థలాలు ఇస్తామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ అన్నారు. సీఎం దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో గ్రామ పునర్నిర్మాణంపై గ్రామ సభ మంగళవారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత గ్రామంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనుల పై ప్రజలకు వివరించారు. అధికారులు రూపొందించిన లేఅవుట్‌ను గ్రామస్థు లు గ్రామసభలో ఆమోదించారు. ఈ సందర్భంగా దీపక్‌ తివారీ మాట్లాడుతూ గ్రామ పునర్నిర్మాణానికి అంగీకారం తెలుపుతూ తీర్మానాలు ఇవ్వాలన్నారు. గ్రామంలో శిఽథిలమైన ఇళ్లను కూల్చివేసి సకల సదుపాయాలతో ఆధునిక కాలనీల నిర్మాణం చేపట్టాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం 584 ఇళ్లు ఉన్నాయని, అందులో 333 ఇళ్లు పెంకుటిళ్లు, గుడిసెలు శిథిలావస్థలో ఉం డగా 103 ఇళ్లు పక్కా ఇళ్లు ఉన్నట్లు గ్రామ సభలో అధికారులు తెలిపారు. 29 వేల గజాల్లో ఆర్కిటెక్ట్‌తో రూపొందించిన గ్రామ పునర్నిర్మాణ మ్యాపులో 103 పక్కా ఇళ్లను యథావిధిగా ఉంచడంతోపాటు 481 గృహాలను 200 చదరపు గజాల విస్తీర్ణంతో గృహ నిర్మాణాలు నిర్మించడానికి లేఅవుట్‌ను సిద్ధం చేసిన ట్లు తెలిపారు. ఈ లేఅవుట్‌లో 33, 45 ఫీట్ల రోడ్లు, అంతర్గత డ్రైనేజి నిర్మాణంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడుతామని తెలిపారు. గ్రామం లో 200 గజాలకు పైగా స్థలాలు ఉన్న వారికి గ్రామ సమీపంలోని సర్వే నెం.289లో ఉన్న ప్రభుత్వ భూమిలో కేటాయిస్తామన్నారు. అధికారులు సిద్ధం చేసిన లేఅవుట్‌పై రెండుమూడు రోజుల్లో కలెక్టరేట్‌లో రోజుకు 50మందికి చొప్పున ప్రొజెక్టర్‌ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. గ్రామ సభలో ప్రజలు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు, స్థలం తీసుకున్న వారికి స్థలం ఇస్తామంటున్నారు, మరి ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న తమకు ఎలాంటి ఆర్థికసాయం చేస్తారని పలువురు డిమాండ్‌ చేశారు. గ్రామసభలో డీపీవో సునంద, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి శ్యాంసుందర్‌, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌, డీఈ గిరిదర్‌, ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య, ఉపసర్పంచ్‌ మధు గ్రామస్థులు పాల్గొన్నారు.

మరో చోట ఇచ్చే స్థలం నివాసయోగ్యం కాదు : - వంగరి రమేశ్‌, వాసాలమర్రి

ఉపాధి వ్యాపార నిమిత్తం గ్రామంలో పూర్తిగా అభివృద్ధి చేసుకున్న 1150 గజాల స్థలం ఉంది. గ్రామ పునర్నిర్మాణంలో నాకున్న ఈ విలువైన భూమి పోతుంది. ఈ భూమికి బదులు మరో చోట భూమి ఇస్తానంటున్నారు. గ్రామంలో ప్రస్తుతం చిన్న వస్త్ర దుకాణం పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నాను. అక్కడ ఇచ్చే స్థలం ఏ మాత్రం నివాస యోగ్యం కాదు.

Updated Date - 2023-01-25T00:51:47+05:30 IST