చొక్కాలు చింపుకొని.. కుర్చీలు విసురుకొని
ABN , First Publish Date - 2023-02-07T00:18:37+05:30 IST
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయం కార్యకర్తల కుమ్ములాటకు వేదికైంది.
మిర్యాలగూడ కాంగ్రె్స కార్యాలయంలో ఇరువర్గాల బాహీబాహీ
మిర్యాలగూడ, ఫిబ్రవరి 6: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయం కార్యకర్తల కుమ్ములాటకు వేదికైంది. ఇన్నాళ్లూ ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం మిర్యాలగూ డలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఎల్ఐసీ కార్యాలయానికి వద్దకు వెళ్లి ఏజెంట్ల ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించారు. ధర్నా కోసం టెంట్లు, సామగ్రిని మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్ఆర్) వర్గీయులు సమకూర్చారు. ఎల్ఐసీ కార్యాలయానికి ఏజెంట్లు కూడా చేరుకోకముందే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్నాయక్ తన అనుచరులతో ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లో కూర్చొని ధర్నా చేపట్టారు. బీఎల్ఆర్తో పాటు ఆయన వర్గీయులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ లోగా కార్యాలయానికి చేరుకున్న శంకర్నాయక్ హాత్ సే హాత్ జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరణకు సిద్ధంకాగా, ఇందుకు బీఎల్ఆర్ వర్గీయులు ఆక్షేపణ తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ మాట్లాడుతూ పార్టీ వాట్సప్ గ్రూపులో మీ అనుచరులతో వేర్వేరు సమయాల్లో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయని రకరకాల పోస్టింగ్లు పెట్టిస్తున్నారని, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు రాకముందే కార్యక్రమాలు ఎలా చేస్తారని శంకర్నాయక్ను ప్రశ్నించారు. కౌన్సిలర్లు అందరూ వచ్చేంతవరకైనా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సూచించారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు, బీఎల్ఆర్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఎంత వారించినా కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో శంకర్నాయక్, బీఎల్ఆర్లు పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. మాటలు శ్రుతిమించి ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. ప్లాస్టిక్ చైర్లు విసురుకోవడంతో కౌన్సిలర్ శేఖర్రెడ్డి, వసంతకుమార్ తలకు గాయాలయ్యాయి. సతీష్, శాంతికుమార్, నాగునాయక్ చొక్కాలు చినిగాయి. డీసీసీ అధ్యక్షుడి వర్గీయుడైన నాగునాయక్, బీఎల్ఆర్ అనుచరుడైన శాంతికుమార్ వన్టౌన్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ రాఘవేంద్ర తెలిపారు.