జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తేవాలి
ABN , First Publish Date - 2023-01-25T00:19:20+05:30 IST
జాతీయ స్థాయిలో కూడా తైక్వాండో పోటీల్లో సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత
సిద్దిపేట క్రైం, జనవరి 24: జాతీయ స్థాయిలో కూడా తైక్వాండో పోటీల్లో సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. తైక్వాండో ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడుతుందన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 10 పతకాలను సాధించారు. ఇందులో 3 గోల్డ్, 4 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. పతకాలు సాధించినవారిలో జూనియర్ విభాగంలో జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన శ్రీ వేదరెడ్డిని మంగళవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ శ్వేత అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో జిల్లా కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.