ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్
ABN , First Publish Date - 2023-02-07T00:25:02+05:30 IST
రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆర్ఐ పట్టుబడిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం చోటు చేసుకున్నది.
భూమిని పాస్బుక్లో ఎక్కించేందుకు రూ.2లక్షలు డిమాండ్
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్ఐ
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 6: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆర్ఐ పట్టుబడిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం చోటు చేసుకున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేట మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివా్సకు 1313 సర్వే నంబర్లో 22 గుంటల భూమి ఉంది. కొత్త పాస్బుక్లో తక్కువ భూమి ఉన్నట్లు ప్రింట్ కావడంతో సరి చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరిని సంప్రదించాడు. శ్రీనివాస్ భూమి పక్కనే ఆర్ఐకి సంబంధించిన భూమి కూడా ఉండడంతో.. తనకు 18 గజాల భూమి ఇవ్వాలని ఆర్ఐ డిమాండ్ చేశాడు. ఆ మేరకు శ్రీనివాస్ తన 22 గుంటల భూమిలో నుంచి 18 గజాలను ఇవ్వడంతో మిగిలిన భూమిని కొత్త పాస్బుక్లో ఆర్ఐ నమోదు చేసి ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీనివా్సకే చెందిన మరింత భూమిని కూడా కొత్త పాస్బుక్లో ఎక్కించాలని ఆర్ఐ శ్రీహరిని కోరగా.. అందుకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని ఆర్ఐ డిమాండ్ చేశాడు. తనకు అంత స్తోమత లేదని బాధితుడు ఒప్పుకోకపోవడంతో రూ.లక్ష ఇస్తేనే చేస్తానంటూ కొన్ని రోజులుగా శ్రీనివా్సను ఆర్ఐ వేదిస్తున్నాడు. సహనం కోల్పోయిన శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. వారి పథకం ప్రకారం సోమవారం ఆర్ఐ శ్రీహరి భూమిని విరాసత్ చేశాడు. రూ.లక్షను చందంపేట వీఆర్ఏ సురే్షబాబుకు ఇచ్చి పంపాలని బాధితుడు శ్రీనివా్సకు ఆర్ఐ చెప్పాడు. ఈ మేరకు శ్రీనివాస్ వీఆర్ఏకు రూ.లక్ష అందించాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్, సీఐ వెంకటరాజగౌడ్, రమేష్ ఆధ్వర్యంలో రుద్రారం గ్రామ శివారులో దాడులు చేశారు. రూ.లక్ష నగదుతో పాటు వీఆర్ఏ సురేష్, ఆర్ఐ శ్రీహరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.