వరిపంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2023-01-24T23:48:26+05:30 IST
గజ్వేల్, జనవరి 24: రైతులు వరిపంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని గజ్వేల్ వ్యవసాయ శాఖ ఏడీ బాబునాయక్ అన్నారు.
గజ్వేల్, జనవరి 24: రైతులు వరిపంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని గజ్వేల్ వ్యవసాయ శాఖ ఏడీ బాబునాయక్ అన్నారు. గజ్వేల్ మండల పరిధిలోని సింగాటం, బెజుగామ, పిడిచెడ్, ప్రజ్ఞాపూర్ గ్రామాలలో జిల్లా మంత్రి హరీశ్రావు, వ్యవసాయాధికారి ఆదేశాలతో వరిపంటలను పరిశీలించి, మొగిపురుగు, కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. రైతులు వరిని నాటువేసిన 10 నుంచి 15 రోజులలో కార్టా్పహైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు, ఫ్లూబెండమైడ్ గుళికలు 5 కిలోల గుళికలు, ప్రిప్రోనీల్ 6 కిలోల గుళికలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జీ గుళికలు 4 కిలోల 10 కిలోల ఇసుకలో కలిపి ఎకరాకు తప్పనిసరిగా వేసుకోవాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున రోజు రాత్రి కొత్త నీటిని పెట్టి ఉదయాన్నే తీసివేయాలన్నారు.
మిరుదొడ్డి: మొగిపురుగుతో రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి మల్లేశం అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలోని ఎంపీపీ సాయిలు, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరచారితో కలిసి వరిపంటలను పరిశీలించారు.
రాయపోల్: వరి చేలల్లో కాండం తొలుచు పురుగును నివారించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాంసుందర్ సూచించారు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి కాండం తొలుచు పురుగు సోకిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు.
చేర్యాల: చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు పర్యటించి వరి పంట చేలను పరిశీలించారు. మొగిపురుగు ఆశించి నష్టపోతున్న క్రమంలో ఏడీఏ రాధిక, పంట పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.