ఫేస్ ‘బుక్‘
ABN , First Publish Date - 2023-01-25T22:59:48+05:30 IST
ఫేస్ బుక్లో పరిచయమైన ఓ యువకుడి వల్ల ఓ యువతి మోసపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బస్వాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పెళ్లి కాలేదని నమ్మించిన యువకుడు
మోసపోయిన యువతి
యువకుడి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టడంతో వెలుగులోకి..
ఉండవల్లి, జనవరి 25: ఫేస్ బుక్లో పరిచయమైన ఓ యువకుడి వల్ల ఓ యువతి మోసపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బస్వాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన మాబుతో ఆరు నెలల కిందట ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. మాబు తనకు ఎవరూ లేరని యువతికి చేరువయ్యాడు. గత ఏడాది నవంబరులో తాడిపత్రి నుంచి మకాం మార్చి యువతి స్వగ్రామం బస్వాపురానికి వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులతో నమ్మబలికాడు. తర్వాత యువతితో కలిసి ఉన్నాడు. అయితే ఆ యువకుడి తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదని ఈ నెల ఏడున తాడిపత్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బస్వాపురానికి చేరుకుని ఆ యువకుడిని తీసుకెళ్లారు. అప్పుడు మళ్లీ వస్తానని, తనకు పెళ్లి కాలేదని చెప్పాడు. యువకుడు వెళ్లిపోయాక కొన్ని రోజుల వరకు అతన్నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సదరు యువతి ఫోన్ చేసి నిలదీయగా, తనకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని, నీ దారి నీదేనని చెప్పాడు. నిర్ఘాంతపోయిన యువతి మోసపో యానని తెలుసుకుని ఉండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.