ఓసీపీ-5 బ్లాస్టింగ్‌లు, కాలుష్యంపై విచారణ

ABN , First Publish Date - 2023-02-02T00:09:22+05:30 IST

ఓసీపీ-5 బ్లాస్టింగ్‌లు, కాలుష్యం పై బుధవారం డిప్యూటీ డైరెక్టర్‌(మైన్స్‌ సేఫ్టీ) అధికారులు విచారణ జరిపారు.

ఓసీపీ-5 బ్లాస్టింగ్‌లు, కాలుష్యంపై విచారణ

గోదావరిఖని, ఫిబ్రవరి 1: ఓసీపీ-5 బ్లాస్టింగ్‌లు, కాలుష్యం పై బుధవారం డిప్యూటీ డైరెక్టర్‌(మైన్స్‌ సేఫ్టీ) అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణను పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ఆర్‌జీ-1 యాజమాన్యం అన్ని రకాల ప్రయోగాలు చేసింది. తాము తక్కువ మోతాదులో బ్లాస్టింగ్‌ చేస్తున్నామని, డస్ట్‌ వెలువడడం లేదని,నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామంటూ డీడీఎంఎస్‌ అధికారులకు వివరించారు. స్థానిక కార్పొరేటర్‌ పెద్దెల్లి తేజస్వి, కాంగ్రెస్‌ నాయకులు పెద్దెల్లి ప్రకాష్‌, మాజీ కార్పొరేటర్‌ బాబుమియా, సంజయ్‌నగర్‌ కాలనీవాసు లు డీడీఎంఎస్‌ అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నా రు. మొదట ఓసీపీ-5 ప్రాజెక్టు ఆఫీస్‌కు చేరుకున్న డీడీఎంఎస్‌ అధికారులు కమలేష్‌ వర్మ, సనత్‌ కుమార్‌లు ప్రాజెక్టు వివరాలను పరిశీలించారు. ఎంత మట్టి, బొగ్గు తీసేందుకు అనుమతులు ఉన్నాయని, ఎంత మోతాదులో బ్లాస్టింగ్‌ చేస్తున్నారనే విషయాలను ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ, ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ గోవిందరావు, కాలరీ మేనేజర్‌ అనీల్‌ గబాలే, బ్లాస్టింగ్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ వివరించారు. స్థానిక కార్పొరేటర్‌ పెద్దెల్లి తేజస్వి, కాలనీవాసులు డీడీఎంఎస్‌ కమలేష్‌వర్మను కలిసి సమస్యలు వివరించారు. అనంతరం డీడీఎంఎస్‌ కమలేష్‌వర్మ సంజయ్‌నగర్‌ కాలనీలో మిల్లిమెట్ల నుంచి పరిశీలన జరిపారు. బ్లాస్టింగ్‌, డస్ట్‌ సప్రెషన్‌, పేళుళ్ల శబ్ద తీవ్రత పరీక్షించారు. డీడీఎంఎస్‌ తనిఖీ చేస్తుండడంతో ఓసీపీ-5 అధికారులు చాలా తక్కువ మోతాదులో పేలుడు పదార్థాలు కూడా ఉపయోగించి బ్లాస్టింగ్‌ చేశారు. స్థానికులకు శబ్దం కూడా వినబడని స్థాయిలో బ్లాస్టింగ్‌ జరిగింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ బ్లాస్టింగ్‌ తీవ్రతతో గోడలు పగులుతున్నాయని, సామగ్రి కింద పడుతున్నాయని, చెవులు పని చేయకుండా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమలేష్‌వర్మ సింగరేణి తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. గురువారం కూడా డీడీఎంఎస్‌ స్థా నికంగా విచారణ జరుపనున్నది.

Updated Date - 2023-02-02T00:09:26+05:30 IST