జగిత్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా

ABN , First Publish Date - 2023-01-26T00:54:09+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జగిత్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో

జగిత్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా

జగిత్యాల, జనవరి 25(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జగిత్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీనామా విషయాన్ని వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పదవి చేపట్టిన రెండో రోజు నుంచే ఎమ్మెల్యే కుట్రలు చేశారని విలపించారు. తన కుటుంబాన్ని కూడా బెదిరించారని ఆరోపించారు. ఇన్నాళ్లూ తిట్టినా భరించానని, ఇకమీద భరించే ఓపిక తనకు లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ‘దొరా నీకో దండం.. ఇక చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నా’నంటూ ఎమ్మెల్యే సంజయ్‌ను ఉద్దేశించి భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మున్సిపల్‌ పరిపాలనలో జోక్యం చేసుకుంటూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, తనకు ఎటువంటి పరిపాలనాపరమైన స్వేచ్ఛను లే కుండా చేశారని శ్రావణి ఆరోపించారు. తనను పలు పర్యాయాలు అవమానించారని, అయినా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసుకుంటూ ముం దుకు వెళ్లానని చెప్పారు. ఇన్ని రోజులుగా నామమాత్రంగానే మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశానని, అడుగడుగునా ఎమ్మెల్యే సంజయ్‌ పెత్తనం చెలాయించారని ఆమె ఆరోపించారు. బీసీ సామాజికవర్గానికి చెం దిన తాను ఎదగడం చూడలేకే ఆయన అణచివేతకు గురిచేశారన్నారు. ఎమ్మెల్యే నుంచి తన కుటుంబానికి ఆపద పొంచి ఉందని, తమకు ఏదైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ బాధ్యుడు అని ఆమె తెలిపారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీ సింధూశర్మను కోరారు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో సమర్పించినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2023-01-26T00:54:11+05:30 IST