Hyderabad: కుమార్తె మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-02-06T09:22:18+05:30 IST
25 రోజుల క్రితం మృతి చెందిన తన కుమార్తెను తలచుకొంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ
హైదరాబాద్/కూకట్పల్లి: 25 రోజుల క్రితం మృతి చెందిన తన కుమార్తెను తలచుకొంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల గ్రామానికి చెందిన దండుగుల సూర్యప్రకాష్ కుమార్, సుగుణ సుశీల(38) దంపతులు కూకట్పల్లి ఎల్లమ్మబండ సమీపంలోని మహంకాళినగర్లో నివాసముంటున్నారు. సూర్యప్రకాష్ కుమార్ క్యాటరింగ్ పని, సుగుణ సుశీల కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. వీరికి అన్నమ్మ అనే కుమార్తె, ఓ కుమారుడు ఉన్నాడు. ఇంటర్ చదువుతోన్న 16 ఏళ్ల అన్నమ్మ మానసిక ఒత్తిడి కారణంగా గత నెల 12న ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సుగుణసుశీల కుమార్తెను తలచుకుంటూ బాధపడేది. ఈనెల 4న భర్త క్యాటరింగ్ పనిమీద బయటకు వెళ్లగా, సుగుణసుశీల కుమారుడితో కలిసి రాత్రి 11 గంటల వరకు కిరాణా దుకాణంలోనే ఉంది.
ఆ తర్వాత కుమారుడిని దుకాణంలో ఉండమని చెప్పి.. ఇప్పుడే వస్తానంటూ ఇంటికి వెళ్లింది. ఎంతసేపటికి తల్లి రాకపోవడంతో కుమారుడు ఇంటికెళ్లి పిలిచినా ఆమె తలుపులు తీయకపోవడంతో కిటికీ అద్దం పగులగొట్టి లోపలికి వెళ్లగా, తల్లి ఉరేసుకుని కనిపించింది. స్థానికులు, బంధువుల సహాయంతో ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. ‘నా కుమార్తె (అన్నమ్మ) లేకుండా నేను ఉండలేకపోతున్నాను.. అందుకే నేను కూడా చనిపోవాలని నిర్ణయించుకొన్నాను. నన్ను పెంచిన నీ రుణం తీర్చుకోలేను.. నన్ను క్షమించు అన్నయ్యా.. జీవితం మీద విరక్తి కలిగింది’ అంటూ ఆమె రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.