Hyderabad City: ఒక్కరోజు వ్యవధిలో 20 ఇళ్లల్లో దొంగతనం..

ABN , First Publish Date - 2023-02-02T13:05:54+05:30 IST

కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ పరిధిలో ఇటీవల ఒక్కరోజు వ్యవధిలో 20 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు

Hyderabad City: ఒక్కరోజు వ్యవధిలో 20 ఇళ్లల్లో దొంగతనం..

హైదరాబాద్‌ సిటీ: కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ పరిధిలో ఇటీవల ఒక్కరోజు వ్యవధిలో 20 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 210.48 గ్రాముల బంగారం, 2.792 కేజీల వెండి, 6 ల్యాప్‌టా్‌పలు, 4 గడియారాలు, ఒక కెమెరా, 2 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాద్‌లోని సీసీఎస్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ (క్రైమ్స్‌ అండ్‌ సిట్‌) ఏఆర్‌ శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ (ఓఎస్‌డీ) రాధాకిషన్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. కర్ణాటక హుబ్లీకి చెందిన దార్ల నెహమయ్య అలియాస్‌ మెహమయ్య అలియాస్‌ బ్రూస్‌లీ, అదే రాష్ట్రం సేడంకు చెందిన మందుల శంకర్‌ స్నేహితులు. కూలీపనులు చేసే వారు గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. వీరు పనులకోసం వివిధ నగరాలకు వెళ్తుంటారు. మొదట మురికి వాడలు న్న ప్రాంతాల ఆచూకీ తెలుసుకుని, అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుంటారు.

నెల రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. మద్యం/గంజాయి తాగి దొంగతనాలకు బయలుదేరుతారు. స్ర్కూడైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌తో తాళాలు తెరిచి ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి, ఖరీదైన వస్తువులు దోచుకుంటారు. ఇలా కొంతకాలంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 53 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఒక్కరోజులోనే కూకట్‌పల్లిలో 9, ఎల్‌బీనగర్‌లో 7 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ప్రత్యేకంగా దృష్టి సారించిన సీపీ సీవీ ఆనంద్‌.. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. డీసీపీ రాధాకిషన్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌.. ఘరానా దొంగలు సనత్‌నగర్‌ పరిధిలోని ఫతేనగర్‌ ప్రాంతం మురికివాడలో ఉంటున్నట్లు గుర్తించారు. నెహమయ్య, శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్‌లో స్వీట్‌ తయారీ మాస్టర్‌గా పనిచేస్తున్న మనోజ్‌కుమార్‌ మాలిక్‌(ఒడిసా), బోయిన్‌పల్లికి చెందిన నామాలా శ్రీధర్‌(డ్రైవర్‌) ద్వారా దోచేసిన బంగారం, వెండిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిపారు. దాంతో మనోజ్‌కుమార్‌ మాలిక్‌, శ్రీధర్‌ను కూడా అరెస్ట్‌ చేసి మొత్తం నలుగురిని కటకటాల్లోకి నెట్టారు. ఘరానా దొంగలను పట్టుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను సీపీ అభినందించినట్లు అడిషనల్‌ సీపీ వెల్లడించారు.

Updated Date - 2023-02-02T13:05:56+05:30 IST