కథారచయిత భమిడిపాటి కన్నుమూత
ABN , First Publish Date - 2023-02-07T03:52:05+05:30 IST
రచయితగా కంటే పౌరుడిగా ఉండటమే ఇష్టమని’ ప్రకటించిన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు (89) హఠాన్మరణం చెందారు.
పలువురు సాహితీవేత్తల నివాళులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రచయితగా కంటే పౌరుడిగా ఉండటమే ఇష్టమని’ ప్రకటించిన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు (89) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం స్పృహ తప్పి పడిపోయి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా ఆయన కోకాపేటలోని పెద్దకూతురు పద్మ వద్ద ఉంటున్నారు. ఆయన స్వస్థలం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు. సాహితీ దిగ్గజాలు పాలగుమ్మి పద్మరాజు, దిగుమర్తి సీతారామస్వామిల శిష్యుడైన భమిడిపాటి నాగపూర్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీలోని తెలుగు సమాచార, పౌర సం బంధాల శాఖ జాయింట్ డైరెక్టర్గా, గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పనిచేశారు భమిడిపాటి. 1959లో కథారచన ప్రారంభించి సము ద్రం’, ‘మంటల్లో జాబిల్లి’, ‘బంతి’ కథలతో ప్రత్యేకగుర్తింపును పొందారు. ‘భమిడిపాటి జగన్నాథరావు కథలు’, ‘మువ్వలు’, ‘అడుగుజాడలు’ కథాసంపుటాలు, ‘పరస్పరం’ రచనలు పుస్తకాలుగా వచ్చాయి. ఆయన భౌతికకాయానికి కథాసాహితీ నిర్వాహకుడు వాసిరెడ్డి నవీన్, రచయిత రాజారామ్మోహన్రావు నామాడి శ్రీధర్, ఒమ్మి రమేష్బాబు, సాహితీవేత్తలు నివాళులు అర్పించారు. కొత్తగూడ ఇజ్జత్నగర్ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి.