ప్రధాని మోదీ మౌనం వీడాలి
ABN , First Publish Date - 2023-02-07T03:34:21+05:30 IST
దేశ ప్రజల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైనా కూడా అంతా బాగుందని కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం తగదని
అదానీ వ్యవహారంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలి
స్ఫూర్తినిచ్చేలా కేసీఆర్ బడ్జెట్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, పిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైనా కూడా అంతా బాగుందని కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం తగదని, దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, ఇందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అదానీతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల షేర్ల విలువ గత నెల 23 నుంచి భారీగా పడిపోవడంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అదానీ వ్యవహారంపై ప్రజల ముందుకొచ్చి వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపరిస్తే... రూ.2.9 లక్షల కోట్లతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ మాత్రం దేశానికి స్పూర్తి కలిగిస్తోందని చెప్పారు.