TS High Court: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2023-02-06T11:23:01+05:30 IST

హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

TS High Court: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

హైదరాబాద్: హైకోర్టు (High Court)లో తెలంగాణ ప్రభుత్వాని (Telangana Govt.)కి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణ (CBI investigation)కు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ (Green Signal) ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థిస్తూ.. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ఈ ఆర్డర్‌పై సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ (Advocate General) అడిగారు. అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించింది.

పూర్తి వివరాలు..

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం జనవరి 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలా..? వద్దా..? అనే అంశంపై సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంపై ఈడీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్‌ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

Updated Date - 2023-02-06T11:23:05+05:30 IST