పోడు భూములకు పట్టాలిస్తాం: సత్యవతి
ABN , First Publish Date - 2023-01-25T03:28:59+05:30 IST
అర్హులైన రైతులందరికీ త్వరలోనే పోడుపట్టాలు అందించి రైతుబంధును అమలు చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అన్నారు. విద్యతోనే ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పారు.

బీజేపీ నేతలు చేసిందేమీ లేదు: అల్లోల
నాగోబాకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు
ఆదిలాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అర్హులైన రైతులందరికీ త్వరలోనే పోడుపట్టాలు అందించి రైతుబంధును అమలు చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అన్నారు. విద్యతోనే ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పారు. ఆదివాసీలు ఆరాధ్యదైవంగా కొలిచే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు మంగళవారం మంత్రులు సత్యవతి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. కేస్లాపూర్లో ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ అధ్యక్షతన నిర్వహించిన గిరిజన దర్బార్లో పాల్గొన్న మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. త్వరలోనే ఉట్నూర్కు అగ్రికల్చర్ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి కేంద్రానికి పంపించినా స్పందించడం లేదన్నారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించేందుకే గిరిజన దర్బార్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు నాగోబా ఆలయానికి రూ.15 కోట్లను ఖర్చు చేశామని, మరో రూ.12.5 కోట్లు మంజూరు చేస్తామన్నారు.