Hyderabad: కుమారుడిని విమానాశ్రయంలో వదిలి వస్తూ..అనంత లోకాలకు..
ABN , First Publish Date - 2023-01-26T08:40:18+05:30 IST
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న కొడుకును విమానాశ్రయంలో వదిలి తిరిగి వస్తున్న తండ్రి
హైదరాబాద్/దుండిగల్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న కొడుకును విమానాశ్రయంలో వదిలి తిరిగి వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మెదక్ జిల్లా, శివంపేట దంతి గ్రామానికి చెందిన పిట్ల నిరంజన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడు. అతడిని శంషాబాద్ విమానాశ్రయంలో వదిలిన తండ్రి పిట్ల నరేష్(52), తల్లి మాణికేశ్వరి, స్నేహితులు నిఖిల్, నక్క వంశీ కారులో బుధవారం ఓఆర్ఆర్ మీదుగా తిరిగి వస్తున్నారు. డ్రైవర్ కారును వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారు గాయపడ్డారు. దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారును వేగంగా నడిపిన పిట్ల వినయ్కుమార్పై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు.