Hyderabad: ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2023-02-06T08:56:10+05:30 IST
అతివేగంతోపాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. ఆదివారం కీసర వద్ద ఓఆర్ ఆర్పై
హైదరాబాద్/కీసర: అతివేగంతోపాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. ఆదివారం కీసర వద్ద ఓఆర్ ఆర్పై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానిక సీఐ రఘువీర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన జహంగీర్(45) సూరారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో డీసీఎం డ్రైవర్. ఆదివారం సెలవు కావడంతో ఇంటి సామగ్రి తెచ్చుకునేందుకు కంపెనీలోని సూపర్వైజర్ కారును తీసుకుని మోత్కూరుకు వెళ్లాడు. భార్య సుల్తానా(42), కుమారుడు నజీర్(24)తోపాటు కంపెనీలో పనిచేసే మహబూబ్నగర్ తొర్రూరుకు చెందిన రవి(35), శ్రీను(40), పీర్(24), సంపత్(12)ను తోడుగా తీసుకెళ్లాడు. కీసర జంక్షన్ సమీపంలో ఘట్కేసర్ నుంచి అతివేగంగా వచ్చిన బెంజ్ కారు డివైడర్ను ఢీకొని అవతలి వైపు ఎదురుగా వస్తున్న వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహంగీర్(45), సంపత్(12) అక్కడికక్కడే మృతిచెందారు. రవి, శ్రీను, పీర్, సుల్తానా, నజీర్తో పాటు బెంజ్కారులో ఉన్న డానియెల్(36), జెస్సికా(28)కు తీవ్ర గాయాలయ్యాయి. ఓల్డ్సిటీ బండ్లగూడకు చెందిన డానియెల్, జెస్సికా గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. డానియెల్ అతివేగంతోపాటు, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీర్రెడ్డి తెలిపారు.