Hyderabad City: నమ్మకంగా పిలిచి.. నరికేశారు
ABN , First Publish Date - 2023-01-25T10:32:56+05:30 IST
కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడలో ఆదివారం సంచలనం సృష్టించిన సాయినాథ్
హైదరాబాద్ సిటీ: కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడలో ఆదివారం సంచలనం సృష్టించిన సాయినాథ్ దారుణహత్య కేసులో అతని స్నేహితులే నిందితులని పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులు ఆకాశ్, టిల్లూ అలియాస్ శివకుమార్, సోనూలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులంతా చిన్నప్పటినుంచి సాయినాథ్తో కలిసి పెరిగిన వారేనని, 10వ తరగతి వరకు కలిసే చదువుకున్నారని పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి నాలుగు రోజుల ముందు కూడా వారంతా సరదాగా, సంతోషంగా ఉన్నట్లు సాయినాథ్ మిత్రులు చెబుతున్నారు. ఆకాశ్, సాయినాథ్లు కోఠి ఇసామియాబజార్లోని దుకాణంలో సరదాగా మాట్లాడుకోవడం చూశామని, వీరిద్దరికీ కామన్ మిత్రుడు ఒకరు చెప్పారు.
హత్య జరిగిన రోజు కూడా సాయినాథ్కు ఫోన్ చేసి, జియాగూడకు పిలిపించారని గుర్తించారు. అక్కడ పరిస్థితిని అంచనావేసి, కీడును శంకించిన సాయినాథ్ బైక్పై పారిపోతుండగా, నిందితులు వెంటాడి హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. అయితే.. నిందితులు సాయినాథ్ను హతమార్చడానికి కారణాలేమిటి? అనే కోణంపై పోలీసులు దృష్టిసారించారు. సాయినాథ్ సెల్ఫోన్ కాల్డేటాను పరిశీలిస్తున్నారు. కాగా.. ఇల్లు కొనేందుకు డబ్బులు జమచేసుకున్న సాయినాథ్ను ఆర్థిక లావాదేవీల కోణంలో హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.