కొత్త రైల్వే లైన్లపై ఆశలు!
ABN , First Publish Date - 2023-02-02T02:44:50+05:30 IST
దక్షిణ మధ్య రైల్వేకు కొత్త లైన్లు రానున్నాయా..! బుల్లెట్ రైళ్ల కోసం ట్రాక్ ఏర్పాటు కానుందా? అంటే.. రైల్వే వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్పై తెలంగాణ వాసుల ఆసక్తి
యాదాద్రికి, బెంగళూరుకు కొత్త లైన్లకు చాన్స్
బుల్లెట్ రైలు కోసం ట్రాక్ వేస్తారా?
పింక్బుక్తోనే స్పష్టత: రైల్వే అధికారులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వేకు కొత్త లైన్లు రానున్నాయా..! బుల్లెట్ రైళ్ల కోసం ట్రాక్ ఏర్పాటు కానుందా? అంటే.. రైల్వే వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బుధవారం నాటి కేంద్ర బడ్జెట్లో రైల్వేకు రికార్డు స్థాయిలో రూ.2.40 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరిగిన నేపథ్యంలో.. తెలంగాణకు కూడా పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. గత బడ్జెట్లో రైల్వేశాఖ రైల్వేలైన్ల పొడిగింపుపై దృష్టిసారించింది. ఇప్పుడు కొత్తలైన్లకు ప్రాధాన్యమివ్వనుందని తెలుస్తోంది. ఎరువులు, ఆహారధాన్యాలు, బొగ్గు తరలింపునకు కొత్త రైల్వేలైన్లపై కేంద్రం బడ్జెట్లో నిధులను కేటాయించింది. ఈ అంశాల్లో రాష్ట్రం కూడా ముందంజలో ఉండడంతో.. కొత్తలైన్లు వస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్- నాగ్పూర్ మధ్య గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైల్వేలైన్ను నిర్మించాలనే డిమాండ్ ముందు నుంచి ఉంది. దక్షిణ మధ్య రైల్వే జీఎంగా వినోద్కుమార్ యాదవ్ ఉన్నప్పుడు.. ఆ మేరకు జోన్ పరిధిలోని బాటిల్నెక్స్ని తొలగించి, రైళ్ల వేగం పెరిగేలా కృషిచేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో సర్వేలు పూర్తిచేశారు. ఈ మార్గంలో బుల్లెట్ రైలు డిమాండ్ పెరుగుతోంది. కాజీపేట, పెద్దపల్లి మీదుగా సికింద్రాబాద్-కరీంనగర్ రైల్వేలైన్ ఏర్పాటు డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-ముంబై మార్గాల్లో అదనపు లైన్ ఏర్పాటు డిమాండ్కు కూడా ఈసారి మోక్షం కలుగుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఘట్కేసర్-యాదాద్రి మూడోలైన్ పనులకు కూడా ఈ సారి లైన్ క్లియర్ అవుతుందనే అభిప్రాయాలు రైల్వే వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేంద్రం రైల్వేకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయించినా.. తెలంగాణకు ఎంతిస్తారనే విషయం పింక్బుక్ విడుదలయ్యాకే తెలుస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అందుకు ఒకట్రెండ్రోజుల సమయం పట్టవచ్చని వివరించారు.