రుణమాఫీకి.. ఐదో ‘సారీ’!

ABN , First Publish Date - 2023-02-07T04:22:42+05:30 IST

నాలుగేళ్లుగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఊరిస్తున్న కేసీఆర్‌ సర్కారు.. ఐదో వార్షిక బడ్జెట్‌లో కూడా రైతులకు ‘సారీ’ చెప్పింది.

రుణమాఫీకి.. ఐదో ‘సారీ’!

బడ్జెట్‌ కేటాయింపులు రూ.6,385 కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్లుగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఊరిస్తున్న కేసీఆర్‌ సర్కారు.. ఐదో వార్షిక బడ్జెట్‌లో కూడా రైతులకు ‘సారీ’ చెప్పింది. 2023- 24 వార్షిక బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎన్నికల ఏడాది కావటంతో రుణమాఫీ పథకానికి రూ.20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. తాజా బడ్జెట్‌ కేటాయింపులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు కేటాయించిన రూ. 6,385 కోట్ల నిధులు.. రూ. 37 వేల నుంచి రూ. 50 వేల కేటగిరీ, రూ. 50 వేల నుంచి రూ. 75 వేల కేటగిరీలో ఉన్న రైతులకు రుణమాఫీకి మాత్రమే సరిపోతాయి. రూ. 75 వేల నుంచి రూ. లక్ష కేటగిరీలో ఉన్న రైతులకు మళ్లీ నిధుల కొరత ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి రుణమాఫీ కోసం కేవలం రూ. 4 వేల కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు పంపించారు. బడ్జెట్‌కు తుదిమెరుగులు దిద్దే క్రమంలో మరో రూ. 2,385 కోట్లు కలిపి రూ. 6,385 కోట్లు కేటాయించటం గమనార్హం. ఈ పథకానికి గడిచిన నాలుగేళ్లలో కలిపి కేవలం రూ. 1,206 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2019- 20 బడ్జెట్‌లో నయాపైసా విడుదల చేయలేదు. ఆ తర్వాత వరుసగా రూ.409 కోట్లు, రూ.354 కోట్లు, రూ.443 కోట్లు కలిపి కేవలం రూ.1,206 కోట్లు విడుదల చేసింది.

Updated Date - 2023-02-07T04:22:43+05:30 IST