Hyderabad: దేశంలోనే తెలంగాణ టాప్-3
ABN , First Publish Date - 2023-02-02T12:12:15+05:30 IST
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో దేశంలోనే తెలంగాణ
సీఎం కేసీఆర్పై 64, మంత్రి హరీశ్ రావుపై 41 కేసులు
ఏడీఆర్ నివేదికలో బట్టబయలు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో దేశంలోనే తెలంగాణ టాప్-3లో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 17మంది మంత్రులుండగా వారిలో 13 మంది అంటే 76ు మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారే. 17 మంది మంత్రుల్లో 10 మంది అంటే 59ు మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెలుగుచూసింది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం... క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల్లో తమిళనాడు 85ు, హిమాచల్ ప్రదేశ్ 78ుతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో మహారాష్ట్ర (65ు), జార్ఖండ్ (64ు), తెలంగాణ (59ు) వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, సీఎం కేసీఆర్పై 64, మంత్రి హరీశ్ రావుపై 41 కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నవారంతా కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 558 మంది మంత్రులు ఉంటే వారిలో 486 మంది అంటే 87ు మంది మంత్రులు కోటీశ్వరులే. మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మంత్రులతో పాటు ఏపీలో 26మంది మంత్రుల్లో 24 మంది (92ు)మంత్రులు కోటీశ్వరులు ఉన్నట్లు తేలింది. కేరళలో 18 మంది మంత్రుల్లో 12 మంది మాత్రమే కోటీశ్వరులని తెలిపింది.
టాప్-10 ధనవంతుల్లో కేటీఆర్, జగన్
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మంత్రుల్లో అత్యధిక ధనవంతుల టాప్-10 జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచే నలుగురు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు విడదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి టాప్-10లో ఉన్నారు.