Delhi Liquor Scam : చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-02-08T09:03:03+05:30 IST

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో అరెస్ట్ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Delhi Liquor Scam : చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

Delhi : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise Polocy) కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో అరెస్ట్ జరిగింది. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు (CBI Officials) అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మాజీ సహాయకుడు కూడా కావడం గమనార్హం. రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసి సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఈకేసులో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లై (Ramachandra Pillai)కి చాటెడ్ అకౌంటెంట్‌గా గోరంట్ల బుచ్చిబాబు పని చేశారు. గతంలో ఇదే కేసులో ఈడీతో పాటు సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.

ఆ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించిన బుచ్చిబాబు

మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆప్‌ నేతల తరఫున సౌత్‌గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులు సేకరించింది విజయ్‌ నాయరేనని ఈడీ తెలిపింది. ఇక ఈ సౌత్‌ గ్రూపులో కేసీఆర్‌ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు. అయితే.. ఆ గ్రూప్‌నకు అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. కాగా.. నిన్న సీబీఐ అధికారులు బుచ్చిబాబును ప్రశ్నించారు. విచారణ తర్వాత రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నేటి ఉదయం అధికారికంగా బుచ్చిబాబు అరెస్టును ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు బుచ్చిబాబును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచునున్నారు.

మరో కీలక పరిణామం..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. చార్జిషీట్‌లో రోజుకో కొత్త పేర్లు చేర్చుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండో చార్జీషీట్‌ను ఫైల్‌ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చారు. చార్జిషీట్‌లో ఈడీ అధికారులు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా చార్జిషీట్‌లో వైసీపీ ఎంపీ మాగుంట పేరును కూడా చేర్చారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.

Updated Date - 2023-02-08T09:45:28+05:30 IST