ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , First Publish Date - 2023-02-01T00:31:09+05:30 IST
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
రాంగోపాల్పేట్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని జీరాలోని వతన్ హోటల్, హదర్బస్తీలోని మహావీర్ కాంప్లెక్స్, జీరా ప్లే గ్రౌండ్ ప్రాంతాల్లో చేపడుతున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ చీర సుచిత్రతో కలిసి ప్రారంభించారు. అనంతరం పక్కనే ఉన్న పార్క్లో అధికారులతో కలిసి పర్యటించి వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, మొక్కలు నాటి పార్కును ఆహ్లాదబరితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాన్ని తొలగించి కమ్యూనిటీ హాల్ను నిర్మించేందుకు ప్రతిపాదనలను అందజేయాలని అధికారులకు తెలిపారు. పార్క్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం జీరా బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, హార్టీకల్చర్ అధికారి రాఘవేందర్, శానిటేషన్ డీఈ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ అతెల్లి మల్లికార్జున్, శ్రీనివాస్గౌడ్, జీరా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడపు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు విజయ్ షా, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, తిర్కాల మనోజ్, తాండ్ర రాజు, జనార్దన్, నాగులు పాల్గొన్నారు.
మహిళపై మంత్రి అసహనం
తాము ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఓ మహిళ మంత్రిని పదేపదే అడగడంతో ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. ‘నేను మాట్లాడే విషయం ఏమిటి.. నువ్వు అడిగే విషయం ఏమిటి అని అన్నారు.
మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలి
పద్మారావునగర్: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం బన్సీలాల్పేట్ డివిజన్ సీ క్లాస్ కమిటీ హాల్లో మహిళలకు కంప్యూటర్, బ్యూటీషియన్, మగ్గం వర్క్లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రాంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత శిక్షణ కేంద్రాలను మహిళలు సద్వియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి కలిగిన వృత్తి లో శిక్షణ పొందాలని సూచించారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తే తమ కుటుంబాలకు చేయూతను అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్న ఎస్ఆర్డీ సంస్థ నిర్వాహకులను మంత్రి అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ అందజేయడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామని తెలిపారు. కార్పొరేటర్ హేమలత, ఎస్ఆర్డీ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్రెడ్డి, శివరాణి పాల్గొన్నారు.