దురాజ్పల్లి జాతరకు పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2023-02-06T08:19:47+05:30 IST
తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర పిలవబడుతోంది.
సూర్యాపేట : తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర పిలవబడుతోంది. ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. లింగ నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతోంది. నేడు బోనాలు సమర్పించి గొర్రెలు, మేకలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్దగట్టుపై పొగమంచు దట్టంగా వ్యాపించింది. ఈ నెల 5 నుంచి 9 వరకూ జాతర జరగనుంది. జాతర సందర్భంగా ఈ రోజు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వ అధికారులు సెలవు ప్రకటించారు. జాతర సందర్భంగా 5 నుంచి హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను మళ్లించారు. హైదరాబాద్- విజయవాడ వైపు వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద ఉన్న ఖమ్మం వైపు వెళ్లే 365 బీబీ బైపాస్ మీదుగా నామవరం, గుంజలూరు స్టేజ్ నుంచి కోదాడ వైపు మళ్లించారు. జాతర సందర్భంగా మొత్తం 1850 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. 60 సిసీ కెమెరాలు, డ్రోన్ లతో నిఘా నిర్వహిస్తున్నారు.