వేములవాడలో భక్తజన జాతర

ABN , First Publish Date - 2023-02-07T01:09:05+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో జాతరను తలపించింది. మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి.

వేములవాడలో భక్తజన జాతర
వేములవాడ రాజన్న ఆలయం వద్ద భక్తుల రద్దీ

వేములవాడ, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో జాతరను తలపించింది. మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి. భక్తులు రుద్రాభిషేకం, అన్నపూజ, శ్రీస్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొనడంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దర్శనం కోసం మూడు గంటలకు పైగా సమయం పట్టింది. కోడెమొక్కు చెల్లింపు కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 20 వేలకు పైగా భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల వాహనాలతో గుడి చెరువు మైదానం నిండిపోయింది. అనుబంధ బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు సమర్పించారు. ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-02-07T01:09:10+05:30 IST