తొలిరోజే.. ఎదురుచూపులు!
ABN , First Publish Date - 2023-02-07T01:29:57+05:30 IST
జిల్లా కలెక్టర్గా రాహుల్రాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి తొలిరోజే ఆలస్యంగా హాజరు కావడంతో.. ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుదారులకు ఎదురుచూపులు తప్పలేదు.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్గా రాహుల్రాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి తొలిరోజే ఆలస్యంగా హాజరు కావడంతో.. ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుదారులకు ఎదురుచూపులు తప్పలేదు. కొత్త కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి ఎన్నో ఆశలతో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చారు. అలాగే ఉదయం 10.30గంటలకే జిల్లా ఉన్నతాధికారులంతా కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. మునుపెన్నడు లేని విధం గా జిల్లా అధికారులతో ప్రజా ఫిర్యాదుల విభాగం ఎంతో సందడిగా కనిపించిం ది. కానీ కలెక్టర్ ఆలస్యంగా రావడంపై అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. కొంత ఆలస్యంగానే ఉదయం 11.29నిమిషాలకు ఫిర్యాదుల విభాగానికి చేరుకున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్భాషా, అదనపు కలెక్టర్ నటరాజన్లు కలెక్టర్ లేకుండానే అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆ తర్వాత 12.15 నిమిషాలకు జిల్లా కలెక్టర్ ప్రజా ఫిర్యాదుల విభాగానికి చేరుకుని అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అయితే అప్పటికే కలెక్టర్ కోసం ఎదురు చూసిన కొంత మంది ఫిర్యాదుదారులు వెనుదిరిగి వెళ్లి పోయారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాలి
ఆదిలాబాద్ టౌన్: ప్రజలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు, ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణీ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వాణిలో అందిన అర్జీలను ఆయా శాఖాధికారులు ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం, అర్హతల మేరకు అర్జీదారుడికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రతిపాదించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణీలో జిల్లా అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ అన్నారు. ఈ ప్రజావాణీలో అదనపు కలెక్టర్లు నటరాజ్, రిజ్వాన్ భాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేష్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.