Aisa Cup: భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడకుంటే ఏం జరుగుతుందో జై షాకు కచ్చితంగా చెప్పేసిన పీసీబీ

ABN , First Publish Date - 2023-02-05T20:18:17+05:30 IST

ఆసియాకప్ విషయంలో భారత క్రికెట్ బోర్డు(BCCI)-పాక్ క్రికెట్

Aisa Cup: భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడకుంటే ఏం జరుగుతుందో జై షాకు కచ్చితంగా చెప్పేసిన పీసీబీ

న్యూఢిల్లీ: ఆసియాకప్ విషయంలో భారత క్రికెట్ బోర్డు(BCCI)-పాక్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య నెలకొన్ని వివాదం క్రమంగా తారస్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది ఆసియాకప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. అయితే, ఆసియాకప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని బీసీసీఐ కార్యదర్శి, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు జై షా ఇప్పటికే తేల్చి చెప్పేశారు. దీంతో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా(Ramiz Raja ) తీవ్రంగా స్పందించాడు. బీసీసీఐ నిర్ణయం అదే అయితే, భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు పాకిస్థాన్ కూడా రాదని హెచ్చరించారు. ఇది మరింత వేడికి కారణమైంది.

ఆసియా కప్ విషయమై చర్చించేందుకు ఏసీసీ నిన్న బహ్రెయిన్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా పాక్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ(Najam Sethi) తన వాదనలు వినిపించారు. ఆసియాకప్‌ను పాక్ నుంచి తరలించాలని కూడా సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. వేదిక ఎక్కడ అన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

శనివారం జరిగిన సమావేశంలో జై షాను సేథీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరులో జరగనున్న ఆసియా కప్‌లో కనుక భారత్ ఆడకుంటే అక్టోబరు-నవంబరులో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆడదని తెగేసి చెప్పినట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. సేథీ అంత కఠినంగా వ్యవహరించడం జై షాను ఆశ్చర్యపరిచినట్టు కూడా అవి పేర్కొన్నాయి. సేథి నుంచి షా అలాంటిది ఊహించకపోవడంతోనే ఆయన ఆశ్చర్యపోయినట్టు రాసుకొచ్చాయి. కాగా, ఆసియాకప్ వేదికను నిర్ణయించేందుకు మార్చిలో ఏసీసీ మరో సమావేశం కానుంది.

Updated Date - 2023-02-05T20:18:20+05:30 IST