ఈ ఫొటో వెనుక పెద్ద కథే ఉంది.. 45 ఏళ్ల తల్లికి మళ్లీ పెళ్లి చేయడానికి ఈ కుర్రాడు ఎన్ని కష్టాలు పడ్డాడంటే..

ABN , First Publish Date - 2023-01-27T09:51:40+05:30 IST

మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు చేసిన పనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఫొటో వెనుక పెద్ద కథే ఉంది.. 45 ఏళ్ల తల్లికి మళ్లీ పెళ్లి చేయడానికి ఈ కుర్రాడు ఎన్ని కష్టాలు పడ్డాడంటే..

కోహ్లాపూర్‌: మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు చేసిన పనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల తండ్రి మరణించడంతో ఒంటరి అయిన తల్లిని ఇరుగుపోరుగు వారు సూటిపోటి మాటలతో వేధించడం ఆ కుమారుడిని కలిచివేసింది. దాంతో 45 ఏళ్ల తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు. కానీ, ఆమె దీనికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత తల్లిని ఎలాగోలా ఒప్పించి తాజాగా ఓ రైతుతో ఆమెకు వివాహం జరిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కోహ్లాపూర్‌కు చెందిన యువరాజ్ షేలే తండ్రి నారాయణ్ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దాంతో తల్లి రత్న భర్త మరణంలో కృంగిపోయింది.

కొన్నిరోజులు మంచాన పడింది. ఆ తర్వాత కోలుకున్న ఆమెకు బయటి ప్రపంచం సూటిపోటి మాటలతో వేధించడం కుమారుడు యువరాజ్ కంటపడింది. దాంతో ఎలాగైనా తల్లికి మళ్లీ పెళ్లి చేసి తోడు ఇవ్వాలని అనుకున్నాడు. ఒకరోజు ఈ విషయం తల్లికి చెప్పాడు. కానీ, రత్న దానికి ససేమీరా అంది. 45ఏళ్ల వయసులో తనకు మళ్లీ పెళ్లి ఏంటని కుమారుడిని అలాంటి ఆలోచన మానుకోవాలని సూచించింది. అయితే, యువరాజ్ మాత్రం తల్లిని ఆ బాధ నుంచి బయటపడేయాలని తన ప్రయత్ననాన్ని ఆపలేదు. చివరకు కొడుకు కోరికను కాదనలేకపోయిన రత్న పెళ్లికి అంగీకరించింది. దాంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిపించాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది. దీంతో ఈ ఫొటో వెనుక ఉన్న పెద్ద కథను తెలుసుకుని యువరాజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-01-27T10:46:53+05:30 IST