అర్ధరాత్రి మంచం కోసం దంపతుల మధ్య గొడవ.. చివరకు ఆ గొడవ ఎంత దూరం వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2023-01-31T18:21:45+05:30 IST

భార్యాభర్తల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చిన్న చిన్న విషయాలకే చాలా మంది దంపతులు గొడవ పడుతుంటారు. అయితే ఆ గొడవలు సరదాగా ఉన్నంత వరకు ఫర్వాలేదు.. అదుపు తప్పితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి.

అర్ధరాత్రి మంచం కోసం దంపతుల మధ్య గొడవ.. చివరకు ఆ గొడవ ఎంత దూరం వెళ్లిందంటే..

భార్యాభర్తల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చిన్న చిన్న విషయాలకే చాలా మంది దంపతులు గొడవ పడుతుంటారు. అయితే ఆ గొడవలు సరదాగా ఉన్నంత వరకు ఫర్వాలేదు.. అదుపు తప్పితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ జంట మధ్య తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. భార్యా భర్తలు విడిపోయే పరిస్థితి కల్పించింది (Fight Between Husband and Wife).

ముంబైలోని (Mumbai) రాంబాగ్‌ లేన్‌కు చెందిన ఓ జంట మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో భార్య విడాకులు కోరింది. భర్త మాత్రం విడాకులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో ఆమెకు భర్తతో ఉండక తప్పలేదు. ఇద్దరికీ క్షణం పడకపోయినా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లోని వస్తువులను చెరిసగం పంచుకొని ఉపయోగించుకుంటున్నారు. టీవీని, మంచాన్ని కూడా గంటల వారీగా పంచుకుని షేర్‌ చేసుకుంటున్నారు. అంటే టీవీ లేదా మంచాన్ని (Bed) ఒకరు కొంత సమయం వరకు, మరొకరు మరికొంత సమయం వరకు వాడుకోవాలన్నమాట.

శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భార్యను భర్త నిద్ర లేపాడు. తను రెస్ట్‌ తీసుకోవాలని, మంచం కావాలని అడిగాడు. అందుకు భార్య అంగీకరించలేదు (Mumbai Couple’s fight over bed). ఆ సమయంలో మంచం వాడుకోవాల్సింది తానని, మంచం మీద నుంచి లేవనని చెప్పింది. దాంతో చిర్రెత్తిన భర్త ఆమె చెంప మీద కొట్టాడు. దెబ్బ గట్టిగా తగలడంతో ఆమె వినికిడి శక్తి కోల్పోయింది. వెంటనే ఆమె ఆస్పత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా చెవి దెబ్బతిందని తేలింది. దీంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై కేసుపెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-01-31T18:21:47+05:30 IST