63 ఏళ్ల వయసులో 24 ఏళ్ల యువతితో పెళ్లి.. ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి మరీ ఈ వయసులో ఇలాంటి పనేంటని అడిగితే..

ABN , First Publish Date - 2023-02-06T15:43:51+05:30 IST

ఈ వయసులో ఇదేంపని అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే పెళ్ళి గురించి అతని కూతుళ్ళు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

63 ఏళ్ల వయసులో 24 ఏళ్ల యువతితో పెళ్లి.. ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి మరీ ఈ వయసులో ఇలాంటి పనేంటని అడిగితే..

అతని వయసు 63సంవత్సరాలు. ఆరుమంది కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసేశాడు. కానీ అతనిప్పుడు తన కూతురు వయస్సున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నెట్టింట్లో వైరల్ గా మారింది. అతని పెళ్ళి గురించి తెలిసిన వాళ్ళు ఈ వయసులో ఇదేంపని అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే పెళ్ళి గురించి అతని కూతుళ్ళు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఇంతకూ ఈ పెళ్ళి కథ, దాని వెనుక కారణం ఏమిటంటే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకి ప్రాంతంలో నాఖేద్ యాదవ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి ఆరు మంది కూతుళ్ళు. ఆరుమందికి పెళ్ళిళ్ళు చేసేశాడు. మూడు సంవత్సరాల కిందట ఇతని భార్య మరణించింది. దీంతో నాఖేద్ యాదవ్ ఒంటరివాడయ్యాడు. ఆరుమంది కూతుళ్ళు ఉన్నా అందరూ అత్తగారిళ్ళలో ఉండేవాళ్ళే.. ఎవరి దగ్గరికి వెళ్ళినా చుట్టం చూపుగా వెళ్ళిరావాల్సిందే.. ఈ కారణంతో అతను ఎక్కడికీ వెళ్ళకుండా ఒంటరిగా ఉండిపోయాడు. ఒంటరితనం వల్ల మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. కనీసం గ్లాసుడు మంచినీళ్ళు అందించే దిక్కులేరు. దీంతో అతను రెండవ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రాంచీ ప్రాంతానికి చెందిన 24సంవత్సరాల అమ్మాయిని చూసి వారి ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్ళిచేసుకున్నాడు. పెళ్ళిలో నాఖేద్ చాలా హుషారుగా ఉన్నాడు. అతని కూతుళ్ళు కూడా పెళ్ళికి హాజరయ్యారు. 'మా నాన్న ఒక్కడే ఉండటం వల్ల మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. వండిపెట్టేవాళ్ళు, బాగోగులు చూసుకునేవాళ్ళు లేకపోవడంతో ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఆయనకు తోడు లభించింది, మాకు బెంగ తీరింది' అని నాఖేద్ కూతుళ్ళు చెప్పారు. తనని చూసుకోవడానికి ఓ మనిషి తోడుగా ఉండాలనే కారణంతోనే నాఖేద్ పెళ్ళిచేసుకున్నట్టు స్పష్టమయ్యింది.

Updated Date - 2023-02-06T15:44:02+05:30 IST