Telangana కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి..రెండు వర్గాల ప్రకటనలతో అయోమయం
ABN , First Publish Date - 2023-01-22T12:55:44+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. పెద్దపల్లి కాంగ్రెస్లో కొత్తగా బీసీ వాదం తెరపైకి వస్తోంది...
పెద్దపల్లి కాంగ్రెస్లో సీటు హీట్ పెరుగుతోందా?.. బీసీ, వెలమ సామాజిక వర్గాల మధ్య టిక్కెట్ ఫైట్ నడుస్తోందా?.. వెలమకు టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్న రేవంత్కు.. బీసీ వాదం కొత్త తలనొప్పి తెస్తోందా?.. పెద్దపల్లి టిక్కెట్పై కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్లు.. తలో దారిన వెళ్తున్నారా?.. అసలు.. పెద్దపల్లి కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?.. పెద్దపల్లి బీసీ, వెలమ టిక్కెట్ వార్ను అధిష్టానం ఎలా సాల్వ్ చేయనుందా?...అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్ సైడ్ లో తెలుసుకుందాం..
తెలంగాణ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి
తెలంగాణ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. పెద్దపల్లి కాంగ్రెస్లో కొత్తగా బీసీ వాదం తెరపైకి వస్తోంది. ఎమ్మెల్యే టికెట్.. వెలమ సామాజికి వర్గానికి ఇవ్వొద్దని.. బీసీలకే కేటాయించాలని కొందరు నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేయడం చర్చకు దారి తీస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్.. గతంలోనే మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుకు రేవంత్రెడ్డి కన్ఫామ్ చేశారు. పెద్దపల్లి కార్యకర్తల సమావేశంలోనే విజయ రమణరావుకు టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ల అభ్యంతరాలతో.. పెద్దపల్లి టిక్కెట్.. ఎవరికి ప్రకటించలేదని, గతంలో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నానని రేవంత్రెడ్డి చెప్పాల్సి వచ్చింది.
టికెట్ ప్రకటన వెనక్కి తీసుకొనేలా ఒత్తిడి
వానికి.. పెద్దపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న విజయ రమణారావు.. రేవంత్రెడ్డికి సన్నిహితుడు. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ తొలిసారి పెద్దపల్లి వెళ్లినప్పుడు విజయ రమణారావును గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఆయన ప్రకటనతో చాలామంది నేతలు నొచ్చుకున్నారు. దీంతో.. రేవంత్రెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే.. దాని వెనుక పెద్ద మంత్రాంగమే నడిచినట్లు తెలుస్తోంది. ఓదెల మండల కాంగ్రెస్ జడ్పీటీసీ గంట రాములు, సీనియర్లపై ఒత్తిడి తెచ్చి టికెట్ ప్రకటనను వెనక్కి తీసుకొనేలా చేశారన్న చర్చ జరిగింది. ఎందుకంటే.. పెద్దపల్లి టికెట్ ప్రకటన తర్వాత రేవంత్ను ఆపకపోతే.. మిగతా చోట్ల కూడా అలాగే ప్రకటించుకుంటూ పోతారని సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో.. టికెట్ల ప్రకటన వ్యవహారం అక్కడితో ఆగిపోయింది.
రెండు వర్గాల ప్రకటనలతో అయోమయం
ఇదిలావుంటే.. తాజాగా.. మళ్లీ.. పెద్దపల్లి కాంగ్రెస్ టిక్కెట్ వ్యవహారం ఆ పార్టీలో హీట్ పుట్టిస్తోంది. పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్.. వెలమ సామాజిక వర్గానికి ఇవ్వొద్దన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. బీసీలకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే.. పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా పెద్దపల్లిలో ఓదెల జడ్పీటీసీ గంట రాములుయాదవ్.. దశ దిశ పేరిటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి టికెట్.. బీసీలకే కేటాయించాలని గంట రాములు అధిష్టానాన్ని కోరడం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అయితే.. ఆయా పరిణామాలు.. విజయ రమణారావు వర్గం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నేతలతో హైదరాబాద్లో రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించిన రోజే కొందరు బీసీ ప్రకటన చేయడం దుమారం రేపింది. అయితే.. ఆ సమావేశంలో విజయ రమణారావు అభ్యర్థిత్వాన్ని రేవంత్రెడ్డి పదేపదే ప్రస్తావించారన్న చర్చ జరుగుతోంది. రెండు వర్గాల వేర్వేరు ప్రకటనలతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడుతున్నాయి.
వెలమ నేత, బీసీ నేతకు మధ్య పార్టీలోనే బహిరంగ పోరు
మరోవైపు.. ఎవరెన్ని ప్రకటనలు చేసినా.. నిరసనలకు దిగినా.. విజయ రామారావు మాత్రం.. అవేమీ పట్టించుకోవడం లేదు. సానుభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తూ.. ఈ సారి ఎలాగైనా గెలవాలని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఇసుక దందాలపై సవాళ్లు విసురుతూ, ప్రమాణాలు చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు. గడప గడపకు కాంగ్రెస్ అంటూ వార్డుల్లో తిరుగుతున్నారు. మొత్తంగా.. పెద్దపల్లి కాంగ్రెస్ టిక్కెట్ విషయంలో రెండు వర్గాలు ఎవరికివారు బహిరంగ ప్రకటనలు చేసుకోవడం ఆసక్తిగా మారుతోంది. వెలమ నేత, బీసీ నేతకు మధ్య పార్టీలోనే బహిరంగ పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎవరి లాబీయింగ్ వర్కవుట్ అవుతుందో?.. అధిష్టానం ఎవరి వాదనను పరిగణనలోకి తీసుకుంటుందో?.. చూడాలి మరి.