ఆ సినిమాకి రూ.150 కోట్లా..?
ABN , First Publish Date - 2023-02-05T05:17:03+05:30 IST
టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయకుల్లో ప్రభాస్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆయన ఒక్కో చిత్రానికీ రూ.100 కోట్లు తీసుకొంటున్నాడని టాక్. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలకు అక్షరాలా వంద కోట్లు అందుకొన్నాడని ట్రేడ్ వర్గాలు
టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయకుల్లో ప్రభాస్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆయన ఒక్కో చిత్రానికీ రూ.100 కోట్లు తీసుకొంటున్నాడని టాక్. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలకు అక్షరాలా వంద కోట్లు అందుకొన్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు తన పారితోషికం అమాంతంగా రూ.150 కోట్లకు పెంచేశాడట. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకొన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ‘పఠాన్’తో హిట్టు కొట్టాడు సిద్దార్థ్. ఈ చిత్రం బాలీవుడ్లో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. సిద్దార్థ్తో పని చేయాలని బాలీవుడ్లోని పెద్ద స్టార్లంతా రెడీ అవుతున్నారు. అయితే సిద్దార్థ్ మాత్రం ప్రభాస్తో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి మధ్య రెండు మూడు దఫాలు చర్చలు సాగాయి. సిద్దార్థ్ కథ చెప్పాడని, అది ప్రభాస్కి నచ్చిందని బాలీవుడ్ మీడియా కూడా కథనాలు రాస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సిద్దార్థ్ ఆనంద్ని మైత్రీ నిర్మాతలు కలిశారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన చర్చలు జరిపారని టాక్. ఈ సినిమాకే ప్రభాస్ రూ.150 కోట్లు అందుకోనున్నాడట. అయితే ఇది సోలో హీరో సినిమా కాదు. ఇందులో హృతిక్ కూడా నటిస్తున్నాడని బాలీవుడ్ వర్గాల కథనం. అదే నిజమైతే దేశంలోనే అతి పెద్ద మల్టీస్టారర్గా ఈ చిత్రం నిలిచిపోవడం ఖాయం.