AAP and BJPల మధ్య వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన సుప్రీం

ABN , First Publish Date - 2023-02-08T12:55:58+05:30 IST

ఎంసీడీ మేయర్ ఎన్నికలను అత్యవసరంగా పూర్తి చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్, ఆప్‌ల ఉమ్మడి పిటిషన్‌పై ఎల్‌జీ, ప్రోటెం ప్రిసైడింగ్ అధికారి కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

AAP and BJPల మధ్య వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన సుప్రీం

ఢిల్లీ : ఆప్(AAP), బీజేపీ (BJP)ల మధ్య వార్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) ఫుల్ స్టాప్ పెట్టింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election)కు ఉన్న అడ్డంకులను సుప్రీంకోర్టు తొలగించింది. ఎంసీడీ మేయర్ ఎన్నికలను అత్యవసరంగా పూర్తి చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్, ఆప్‌ల ఉమ్మడి పిటిషన్‌పై ఎల్‌జీ, ప్రోటెం ప్రిసైడింగ్ అధికారి కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఎల్‌జీ నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయడానికి అనుమతి లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

ముచ్చటగా మూడోసారి వాయిదా..

ఢిల్లీ మేయర్ ఎన్నిక ముచ్చటగా మూడు సార్లు వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్ యాక్ట్-1957 ప్రకారం తొలి మున్సిపల్ సమావేశాల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గత నెల 6, 24 తేదీల్లో జరిగిన రెండు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఈ నెల 6న తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఎల్జీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కానీ మరోమారు ఆప్, బీజేపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈసారి కూడా వాయిదా పడింది.

అసలు గొడవ ఎందుకు?

కీలకమైన 18 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులలో ఆరుగురుని గత సోమవారం అంటే 6వ తేదీన ఎన్నుకోవాల్సి ఉంది. మిగిలిన 12 మందిని జోనల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కాగా, కీలకమైన ఆరుగురు సభ్యుల ఎన్నికలో మూడు సీట్లు ఆప్ గెలుచుకోనుండగా, బీజేపీ రెండు సీట్లు దక్కుంచుకోనుంది. కీలకమైన ఆరో సీటు విషయంలోనే సభలో గందరగోళం తలెత్తింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) నామినేట్ చేసిన 10 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఓటు వేసేందుకు అనుమతించడం ఆప్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు అనుమతిస్తే బీజేపీకి ఆ సీటు దక్కే అవకాశం ఉంది. ఇది ఆప్‌కు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆప్ నిరసనకు దిగింది.

మేజిక్ ఫిగర్‌ను కైవసం చేసుకున్న ఆప్..

250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగాయి. దీనికి సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 7న వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లతో మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఆప్ కైవసం చేసుకుంది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. కాగా.. ఆప్ తరఫున ఢిల్లీ మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున రేఖా గుప్తా పోటీ చేస్తు్న్నారు. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ తరఫున అలెయ్ మొహమ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి కమల్ బాగ్రి పోటీ పడుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎంసీడీ స్టాడింగ్ కమిటీకి ఆరుగురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఆరుగురి ఎన్నిక విషయంలోనే ఆప్, బీజేపీ మధ్య వార్ జరుగుతోంది

Updated Date - 2023-02-08T13:02:41+05:30 IST