ఆగని బీబీసీ లింకుల షేరింగ్
ABN , First Publish Date - 2023-01-25T01:08:33+05:30 IST
ప్రధాని మోదీపై బీబీసీ ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినా.. సోషల్ మీడియాలో ఆ లింకులు
ఆర్కైవ్లో ‘ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ లింకులు
హెచ్సీయూలో అర్ధరాత్రి ప్రదర్శన
వర్సిటీలో ఉద్రిక్తత.. ఏబీవీపీ ఫిర్యాదు
సెక్యూరిటీ నివేదిక కోరిన హెచ్సీయూ
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీపై బీబీసీ ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినా.. సోషల్ మీడియాలో ఆ లింకులు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. 2002 నాటి గుజరాత్ అల్లర్ల వెనుక అప్పటి సీఎంగా ఉన్న ప్రధాని మోదీ ఉన్నట్లు ఆ డాక్యుమెంటరీ స్పష్టం చేస్తోంది. ఇది భారత సార్వభౌమత్వానికి, సుప్రీంకోర్టుకు వ్యతిరేకమని కేంద్రం విమర్శలు గుప్పించింది. విపక్షాలు మాత్రం ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ లింకులను పదేపదే షేర్ చేస్తున్నాయి. టీఎంసీ ఫైర్బ్రాండ్ నాయకురాలు మాహువా మోయిత్రా గతంలోనే ఈ లింకులను పోస్టు చేయగా.. ట్విటర్ వాటిని తొలగించింది. మంగళవారం ఆమె అమెరికాకు చెందిన సంస్థ ఇంటర్నెట్ ఆర్కైవ్ సైట్లో ఉన్న లింకును షేర్ చేస్తూ.. పౌరులు ఆ సోర్స్ ద్వారా బ్లాక్ చేసిన లింకులను వాడుకోవచ్చన్నారు.
జేఎన్యూలో పవర్ కట్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ)లో శనివారం అర్ధరాత్రి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(ఎ్సఐవో), పలు విద్యార్థి సంఘాలు ఈ వీడియోను ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వివాదంపై ఏబీవీపీ విద్యార్థులు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలోని జేఎన్యూలో కూడా విద్యార్థులు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు సన్నాహాలు చేయగా అధికారులు వర్సిటీలోని స్టూడెంట్ యూనియన్ ఆఫీసుకు కరెంటును కట్ చేశారు.