మహిళలకో కొత్త పథకం
ABN , First Publish Date - 2023-02-02T02:11:28+05:30 IST
ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మహిళల కోసం ఓ కొత్త చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని బడ్జెట్లో నిర్మల ప్రకటించారు.
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మహిళల కోసం ఓ కొత్త చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని బడ్జెట్లో నిర్మల ప్రకటించారు. ఆ పథకం పేరు.. ‘మహిళా సమ్మాన్ సేవింగ్ పాత్ర’. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. రెండేళ్ల కాలపరిమితితో రూ.2 లక్షల దాకా ఈ పథకంలో మహిళల/బాలికల పేరిట పొదుపు చేయవచ్చు. 7.5 శాతం స్థిర వడ్డీరేటు వచ్చే పథకం ఇది. డిపాజిట్ చేసిన సొమ్ము నుంచి పాక్షికంగా ఉపసంహరించుకునే వీలును కూడా కల్పించారు.
నిర్భాగ్య ఖైదీలపై నిర్మల కరుణ
ఏదో ఒక కేసులో జరిమానా పడి.. ఆ కాస్త సొమ్మూ కట్టలేక జైళ్లల్లో పడి మగ్గిపోయేవారిపైన, బెయిల్ కోసం చెల్లించాల్సిన సొమ్ము చేతిలో లేక కారాగారాలకే పరిమితమైనవారి పట్ల నిర్మలా సీతారామన్ కరుణ చూపారు. అలాంటివారికి ఆర్థిక సాయం అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇలాంటి ఖైదీలను విడుదల చేయాలంటూ కేంద్రం గత డిసెంబరులో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో గత ఏడాది నిర్వహించిన భేటీలో ప్రధాని మోదీ కూడా ఇలాంటి ఖైదీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.