Lorries: 9న రాష్ట్రవ్యాప్తంగా లారీల సమ్మె
ABN, First Publish Date - 2023-11-02T09:10:07+05:30
రాష్ట్రంలో లారీలకు విధించే త్రైమాసిక వార్షిక పన్నును 40 శాతం మేరకు పెంచడాన్ని నిరసిస్తూ ఈనెల 9న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టాలని
- వ్యాన్లు, గ్యాస్ ట్యాంకర్ల ఓనర్ల మద్దతు
అడయార్(చెన్నై): రాష్ట్రంలో లారీలకు విధించే త్రైమాసిక వార్షిక పన్నును 40 శాతం మేరకు పెంచడాన్ని నిరసిస్తూ ఈనెల 9న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టాలని తమిళనాడు లారీ యజమానుల సంఘ సమాఖ్య నిర్ణయించింది. దీనికి టూరిస్ట్ వ్యాన్ల యజమానులు, ఎల్పీజీ ట్యాంకర్ యజమానులు కూడా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఇదే విషయంపై లారీ యజమానుల సంఘ సమాఖ్య అధ్యక్షుడు ధనరాజ్ మంగళవారం నామక్కల్(Namakkal)లో విలేకరులతో మాట్లాడుతూ... లారీలకు వసూలు చేసే త్రైమాసిక వార్షిక పన్నును ఇటీవల పెంచగా, దాన్ని తగ్గించాలని కోరుతున్నామనీ, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. పెంచిన పన్నును తగ్గించాలన్న తమ న్యాయమైన డిమాండ్తో ఈ నెల 9 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లారీ సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. తమ సమ్మెకు లారీ రవాణా రంగానికి చెందిన అన్ని అనుబంధ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయని వెల్లడించారు. తమ డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరవధిక సమ్మెకు కూడా ఏమాత్రం వెనుకంజ వేయబోమని తెలిపారు. అదేవిధంగా తమిళనాడు ఎల్పీజీ ట్యాంకర్ లారీల సంఘ అధ్యక్షుడు సుందరరాజన్ మాట్లాడుతూ... ఈ నెల 9న చేపట్టనున్న సమ్మెకు తమ సంఘం కూడా పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. దాదాపు 2 వేల ఎల్పీజీ ట్యాంకర్ సేవలు స్తంభించిపోతాయన్నారు. ఈ కారణంగా రూ.3 కోట్ల మేరకు ఆదాయం కోల్పోతుందని ఆయన వివరించారు. అందువల్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన విఙ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-11-02T09:10:07+05:30 IST