ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో భారత్‌

ABN , First Publish Date - 2023-01-26T01:31:34+05:30 IST

ఒకప్పుడు పేదరికం, నిరక్షరాస్యత నిండిన దేశంగా పేరుపడిన భారత్‌ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో నిలబడిందని

ప్రపంచ వేదికపై  ఆత్మవిశ్వాసంతో భారత్‌

న్యూఢిల్లీ, జనవరి 25: ఒకప్పుడు పేదరికం, నిరక్షరాస్యత నిండిన దేశంగా పేరుపడిన భారత్‌ ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో నిలబడిందని, ఈ పరివర్తన వెనుక రాజ్యాంగ నిర్మాతల సమష్టి మేధాశక్తి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వారి మార్గదర్శనం లేకపోతే ఈ ప్రగతి సాధ్యమయ్యేది కాదని, రాజ్యాంగ రూపకర్తలు చూపిన బాటలో నడవడం మనపై ఉన్న బాధ్యత అని చెప్పారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇదే ఆమె తొలి గణతంత్ర సందేశం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ ఆ కమిటీ సభ్యుడు, న్యాయ కోవిదుడు బీఎన్‌ రావుతో పాటు రాజ్యాంగ రచనలో సహకరించిన ఇతర నిపుణులు, అధికారులను స్మరించుకోవాలన్నారు. దేశంలో అనేక జాతులు, అనేక భాషలు ఉన్నా అవి మనల్ని విడదీయలేదని, మనల్ని ఏకం చేశాయని చెప్పారు. ఇదే మన దేశ స్వభావమని, అందుకే మనం ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా విజయం సాధించామన్నారు. మన దేశం గత ఏడాది ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఘనతను మన దేశం సాధించిందన్నారు. మహిళా సాధికారత, స్త్రీ, పురుష సమానత్వం అనేవి ఇక నినాదాలు కాదని, ఈ ఆదర్శాలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో గత కొన్నేళ్లలో మనం ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. జీ 20 అధ్యక్షత భారత్‌కు గొప్ప అవకాశమని, భారత్‌ నాయకత్వంలో మెరుగైన ప్రపంచం కోసం కృషి జరుగుతందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-26T01:31:35+05:30 IST