Cow Dung : ఆవు పేడతో నిర్మించిన ఇంటిపై అణు ధార్మికత ప్రభావం ఉండదు : జడ్జి

ABN , First Publish Date - 2023-01-24T17:22:52+05:30 IST

ఆవు పేడతో నిర్మించిన ఇళ్ళపై అణు ధార్మికశక్తి ప్రభావం ఉండదని సైన్స్ రుజువు చేసిందని గుజరాత్‌లోని టపి (Tapi) జిల్లా సెషన్స్ జడ్జి

Cow Dung : ఆవు పేడతో నిర్మించిన ఇంటిపై అణు ధార్మికత ప్రభావం ఉండదు : జడ్జి
Cows

గాంధీ నగర్ : ఆవు పేడతో నిర్మించిన ఇళ్ళపై అణు ధార్మికశక్తి ప్రభావం ఉండదని సైన్స్ రుజువు చేసిందని గుజరాత్‌లోని టపి (Tapi) జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ (Samir Vyas) చెప్పారు. నయంకానటువంటి అనేక రోగాలను గో మూత్రం నయం చేస్తుందన్నారు. ఆవులను కాపాడాలని చెప్పారు. ఆవుల అక్రమ రవాణా కేసులో గత ఏడాది నవంబరులో తీర్పు చెప్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

గోవధపై జడ్జి సమీర్ వ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవు అంటే ఓ జంతువు కాదని, అది మన తల్లి వంటిదని, నడిచే దేవత అని చెప్పారు. ఆవు రక్తపు చుక్క భూమిపై పడని రోజున అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆవుల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆచరించడం లేదన్నారు. గోవధ, అక్రమ రవాణా నిరంతరం జరుగుతున్నాయన్నారు. నాగరిక సమాజానికి ఇది గౌరవప్రదం కాదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, గోవధ సంఘటనలు తగ్గడానికి బదులు పెరుగుతున్నాయన్నారు. గో ఆధారిత సహజ సాగు విధానంలో పండించే పంటలు అనేక రోగాల నుంచి మనల్ని కాపాడతాయని చెప్పారు. ఆవు పేడతో నిర్మించిన ఇళ్లపై అణు ధార్మిక శక్తి (Atomic Radiation) ప్రభావం ఉండదని సైన్స్ రుజువు చేసిందని చెప్పారు. గో మూత్రం అనేక నయంకాని రోగాలను నయం చేస్తుందన్నారు.

గోవులను మెకనైజ్డ్ స్లాటర్‌హౌసెస్‌లో వధిస్తున్నందువల్ల ఆవులు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. మాంసాహారులకు మాంసంతోపాటు బీఫ్‌ను కూడా ఇస్తున్నారన్నారు. దేశంలోని ఆవుల్లో 75 శాతం ఇప్పటికే అదృశ్యమైపోయాయని తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ అమీన్ అంజుమ్ 2020 ఆగస్టులో 16 ఆవులు, గేదెలను అక్రమంగా గుజరాత్‌కు తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ లారీని అడ్డగించే సమయానికి ఓ ఆవు, ఓ గేదె మరణించి కనిపించాయి. అంజుమ్ ఆ లారీని వదిలిపెట్టి, పారిపోయాడు, ఆ తర్వాత అతనిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

Updated Date - 2023-01-24T17:22:57+05:30 IST