ఢిల్లీ మద్యం కేసులో.. 72 కోట్లు జప్తు: ఈడీ
ABN , First Publish Date - 2023-01-25T03:34:54+05:30 IST
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. రూ.72 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. రూ.72 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్చార్జి విజయ్ నాయర్, వ్యాపారవేత్తలు సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్లైకు చెందిన ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అటాచ్ చేసిన ఆస్తుల్లో స్థిరాస్తులు, చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, పిక్స్డ్ డిపాజిట్లు, వాహనాలు ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించడంతో కుంభకోణం డొంక కదిలింది. సౌత్ గ్రూప్ అనే సంస్థ ద్వారా ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు అందాయని, ఈ కంపెనీతో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవితకు సంబంధాలు ఉన్నాయని ఈడీ పేర్కొనడంతో కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది.