ADR Report: తెలంగాణ సహా దేశంలోని మంత్రులపై సంచలన నివేదిక
ABN , First Publish Date - 2023-02-01T20:59:57+05:30 IST
రాష్ట్రాల మంత్రులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ సంచలన నివేదిక (Association for Democratic Reforms Report) వెలువరించింది.
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ సంచలన నివేదిక (Association for Democratic Reforms Report) వెలువరించింది. మహారాష్ట్ర (Maharashtra) మంత్రుల్లో (Ministers) 20 మంది మంత్రులకు గాను 13 మందిపై, జార్ఖండ్(Jharkhand)లోని 11 మంది మంత్రులకు గాను ఏడుగురిపై, తెలంగాణ(Telangana)లో 17 మంది మంత్రులకు గాను 10 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని (serious criminal cases) నివేదిక వెల్లడించింది.
558 మంది ఎమ్మెల్యేల్లో 486 మంది కోటీశ్వరులని నివేదిక తెలిపింది. 239 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులున్నాయని స్వయంగా వారే వెల్లడించారు. తెలంగాణలోని 13 మంది మంత్రులు, తమిళనాడులోని(Tamil Nadu) 33 మంది మంత్రుల్లో 28 మంది, బీహార్( Bihar)లోని 21 మంది మంత్రులు, పంజాబ్(Punjab)లోని 11 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులున్నాయని స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు.
28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 567 మంత్రులకు గాను 558 మంత్రుల అఫిడవిట్లను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశారు.
మంత్రుల ఆస్తుల లెక్కలు చూస్తే సగటున ఒక్కొక్కరికి 16.63 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. క్రిమినల్ కేసులున్న మంత్రులకు సగటున ఒక్కొక్కరికి 21.21 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. సగటు ఆస్తుల్లో 73 కోట్ల రూపాయలతో కర్ణాటక(Karnataka) మంత్రులు ముందున్నారు. 47.45 కోట్ల రూపాయలతో మహారాష్ట్ర మంత్రులు రెండో స్థానంలో, ఛత్తీస్గఢ్ మంత్రులు 43.96 కోట్ల రూపాయలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
మొత్తం మంత్రుల్లో 51 నుంచి 60 సంవత్సరాల వయసు వారు 200 మంది ఉన్నారు. 61 నుంచి 70 సంవత్సరాల వయసు వారు 143 మంది, 41 నుంచి 50 ఏళ్ల వయసు వారు 139 మంది మంత్రులున్నారు.
మొత్తం 558 మంది మంత్రుల్లో 51 మంది మాత్రమే మహిళా మంత్రులున్నారు. పశ్చిమబెంగాల్(West Bengal)లో 8 మంది మహిళా మంత్రులుండగా, ఒడిశాలో ఐదుగురు, యూపీలో ఐదుగురు మహిళా మంత్రులున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ (Delhi), మిజోరమ్, నాగాలాండ్, మేఘాలయ, గోవా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం అసెంబ్లీల్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.