Delhi liquor scam: ఈడీ ఛార్జ్‌షీట్‌లో తన పేరుండటంపై స్పందించిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2023-02-02T17:08:24+05:30 IST

ఢిల్లీ మద్యం స్కామ్‌ (Delhi liquor case) లో ఈడీ (ED) దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో తన పేరుండటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు.

Delhi liquor scam: ఈడీ ఛార్జ్‌షీట్‌లో తన పేరుండటంపై స్పందించిన కేజ్రీవాల్
Delhi liquor scam case, Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం స్కామ్‌ (Delhi liquor case) లో ఈడీ (ED) దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో తన పేరుండటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ పనిచేస్తోందని ఆరోపించారు. ఈడీ ఛార్జ్‌షీట్ మొత్తం కల్పితమన్నారుు. ఈడీ ఇప్పటివరకూ 5 వేలకు పైగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిందని, అయితే ఇప్పటివరకూ ఎంతమందికి శిక్షలు పడ్డాయో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

మరోవైపు ఢిల్లీ మద్యం స్కామ్‌‌లో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha), వైసీపీ ఎంపీ మాగుంట (YSRCP MP Magunta) పేర్లున్నాయి. సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌లో కేజ్రీవాల్‌ పేరు వెల్లడైంది. ఇప్పటికే విచారించిన వారి జాబితాలో అలాగే ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం స్కామ్‌ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

రెండో ఛార్జి షీట్‌‌లో ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎంఎల్‌సీ కవిత పేర్లు పలుమార్లు ప్రస్తావించింది. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. మొత్తం 65 మందిని ప్రశ్నించామని, 100 కోట్లు చేతులు మారాయని తెలిపింది. నిందితులు హైదరాబాద్, ఢిల్లీలో పలు హోటళ్ళలో సమావేశమయ్యారని, నిందితులతో కవిత ఢిల్లీ ఒబెరాయ్ మెడిన్స్‌లో, హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సమావేశమయ్యారని ఈడీ తెలిపింది. హోల్‌సేల్ వ్యాపారంలో 12 శాతం లాభాలు రిటైల్ వ్యాపారంలో 185 శాతం లాభాలు వచ్చేలా మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ వెల్లడించింది.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సెక్రటరీ అరవింద్ పేరు కూడా ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఉంది. కీలక నిందితుడు విజయ్ నాయర్ కేజ్రీవాల్ క్యాంపు ఆఫీసు నుండి కార్యకలాపాలు కొనసాగించారని ఈడీ వెల్లడించింది. నిందితులకు కేజ్రీవాల్‌కు మధ్య విజయ్ నాయర్ అనుసంధాన కర్తగా వ్యవహరించారని తెలిపింది. సౌత్ గ్రూపు నుంచి 100 కోట్లు ముడుపులు విజయ్ నాయర్ అందుకున్నారని, సౌత్ గ్రూపునకు, ఆప్ లీడర్లకు మధ్య ఒప్పందంలో భాగంగానే ఈ ముడుపులు అందుకున్నారని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్‌లో సౌత్ గ్రూపునకు 65 శాతం భాగస్వామ్యం ఇచ్చారు. సౌత్ గ్రూపులో కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాఘవ సభ్యులుగా ఉన్నారు. సౌత్ గ్రూపు తరపున అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారు. ముడుపులుగా అందిన డబ్బును గోవా ఎన్నికలకు ఆప్ నేతలు వాడారని ఈడీ వెల్లడించింది. ముడుపులు అందించిన కారణంగా ఢిల్లీ లిక్కర్ సౌత్ గ్రూప్ అయాచిత లబ్ది పొందిందని తెలిపింది. 9 రిటైల్ జోన్స్‌లో సౌత్ గ్రూప్ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపారం చేసిందన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ స్పష్టం చేసింది. నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేశారని, మొత్తం 170 ఫోన్లు వాడగా, అందులో 153 ఫోన్లను ధ్వంసం చేశారని, కేవలం 17 ఫోన్లు మాత్రమే రికవరీ చేశామని ఈడీ తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ కుంభకోణం కేసులో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పునరుద్ఘాటించింది. మద్యం పాలసీ కుంభకోణంలో సిండికేట్‌ కారణంగా ఢిల్లీ సర్కారుకు రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చార్జ్‌షీట్‌లో స్పష్టంచేసింది. ఈ కేసులో సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు(ఏ1)గా సమీర్‌ మహేంద్రు ఉండగా.. మద్యం వ్యాపారి బినయ్‌ బాబు, అమిత్‌ అరోరా, దక్షిణాదికి చెందిన విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, పి.శరత్‌ చంద్రారెడ్డిలను అరెస్టు చేసిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి/ఎక్సైజ్‌ మంత్రి మనీశ్‌ సిసోడియాతో పాటు 14 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు గుర్తుచేసింది. భారీ ఎత్తున అక్రమార్జనకు లోపభూయిష్టంగా విధానాన్ని రూపొందించారని తెలిపింది. హోల్‌సేలర్ల లాభాలను 12 శాతానికి నిర్ణయించారని, అందులో 6 శాతం మేరకు తిరిగి ముడుపులుగా చెల్లించాలనుకున్నారని, అందుకోసం ఖాతా పుస్తకాలను కూడా తారుమారు చేశారని వెల్లడించింది. ఈ కుట్రలో ఆప్‌కు మొత్తం రూ. 100 కోట్ల ముడుపులు అందాయని తెలిపింది. సమీర్‌ మహేంద్రు రూ. 295.45 కోట్ల మేర నేరానికి పాల్పడ్డారని, ఈ మేరకు సాక్ష్యాధారాలు లభించాయని ఈడీ పేర్కొన్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2023-02-02T18:37:12+05:30 IST