Stampade: చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళల మృతి

ABN , First Publish Date - 2023-02-04T19:18:18+05:30 IST

తిరుపట్టూరులోని వణియంబాడి జరిగిన చీరల పంపిణీలో తొక్కిసలాట

Stampade: చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళల మృతి

చెన్నై: తిరుపట్టూరులోని వణియంబాడి జరిగిన చీరల పంపిణీలో తొక్కిసలాట(Stampede) జరిగిన నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో మహిళలు గాయపడ్డారు. థాయ్‌పూసమ్(Thaipoosam) పండుగ సందర్భంగా ఓ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అయ్యప్పన్ మహిళలకు ఉచితంగా చీరలు, పురుషులకు పంచెలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత పంపిణీ చేసిన టోకెన్ల కోసం వేలాదిమంది ఎగబడ్డారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.

ఈ ఘటనల నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది వరకు గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు(Tamil Nadu)లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. మదురైలోని వగై నది పండుగ సందర్భంగా గతేడాది జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లోనూ నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు తొక్కిసలాట ఘటనల్లో 11 మంది చనిపోయారు.

గతేడాది డిసెంబరు 28న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) నెల్లూరులో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మూడు రోజులకు జనవరి 1న గుంటూరులో టీడీపీ(TDP) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించారు.

Updated Date - 2023-02-04T19:19:30+05:30 IST