విద్యుత్ సంస్థలకు బడ్జెట్లో షాక్!
ABN , First Publish Date - 2023-02-07T04:42:51+05:30 IST
విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బడ్జెట్లో షాక్ ఇచ్చింది.
గంపగుత్తగానే డిస్కంలకు డబ్బులు
రూ. 12,715 కోట్ల కేటాయింపు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బడ్జెట్లో షాక్ ఇచ్చింది. 27 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సబ్సిడీని విడిగా ప్రకటించాలని డిస్కంల విజ్ఞప్తిని తోసిరాజని, 2023-24 బడ్జెట్లో రూ.12715 కోట్ల నిధులను గంపగుత్తగానే కేటాయించింది. పంపుసెట్లకు 24 గంటల కరెంట్తో పాటు 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ రాయితీ, మిషన్ భగీరథ పంపులు, జంటనగరాలకు తాగునీటిని అందించే పంపులతో పాటు స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్కు రూపాయి సబ్సిడీ కలిపి మొత్తం వ్యయాన్ని ఈ రూ.12,715 కోట్లలోనే సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయ్ ఒప్పందం ప్రకారం రూ.500 కోట్ల నష్టాలను ప్రభుత్వం భరించే వాటా కూడా ఇందులో ఉంది. గత ఏడాది బడ్జెట్లోనూ గంపగుత్త విధానమే అమలు అయిన సంగతి తెలిసిందే. ఆ బడ్జెట్లో నెలకు రూ.875 కోట్ల చొప్పున రూ.10,500 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది.