Vice Chancellor: ఆ కోర్సులు తీసేయడం లేదు

ABN , First Publish Date - 2023-05-26T09:29:17+05:30 IST

అన్నా విశ్వవిద్యాలయం అందించే తమిళ మాధ్యమం బీఈ సివిల్‌, మెకానికల్‌ కోర్సుల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో చేరుతున్న కారణంగా

Vice Chancellor: ఆ కోర్సులు తీసేయడం లేదు

పెరంబూర్‌(చెన్నై): అన్నా విశ్వవిద్యాలయం అందించే తమిళ మాధ్యమం బీఈ సివిల్‌, మెకానికల్‌ కోర్సుల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో చేరుతున్న కారణంగా, ఆ కోర్సులు నిలిపివేయాలని విశ్వవిద్యాలయ విద్యా కమిటీ సిఫారసు చేసినప్పటికీ, వాటిని నిలిపివేసే ప్రసక్తే లేదని ఉపకులపతి డాక్టర్‌ వేల్‌రాజ్‌(Vice Chancellor Dr. Velraj) ప్రకటించారు. అన్నా విశ్వవిద్యాలయం విద్యార్థుల సౌకర్యార్ధం తమిళ మాధ్యమంలో బీఈ కోర్సులు పరిచయం చేశారు. ఈ కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ, గత విద్యా సంవత్సరం ఆ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీంతో ఈ కోర్సులు రద్దు చేయాలని వర్సిటీ పాఠ్యపుస్తకాల ప్రణాళిక కమిటీ సిఫారసు చేసింది. ఆ ప్రకారం, వర్సిటీ పరిధిలోని 11 అనుబంధ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం తమిళ మాధ్యమం సివిల్‌, మెకానికల్‌ కోర్సులు నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే, మరో నాలుగు కళాశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో బీఈ సివిల్‌, మెకానికల్‌ కోర్సులను నిలిపి వేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ జూలైలో ప్రారంభం కానుంది. గత విద్యా సంవత్సరం 11 కళాశాలల్లో సివిల్‌, మెకానిక్‌ కోర్సుల్లో పదిమందికి తక్కువగా విద్యార్థులు చేరారని, ఈ కోర్సులు కొనసాగిస్తే వర్సిటీకి ఆర్ధిక భారం పెరుగుతోందని పాఠ్యప్రణాళిక విద్యా కమిటీ సూచించింది. ఆ ప్రకారం, దిండుగల్‌(Dindugal), రామనాధపురం, అరియలూరు, బన్రూట్టి, పట్టుకోట, తిరుక్కువనై, నాగర్‌కోయిల్‌, తూత్తుకుడి కళాశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే, ఆరణి, విల్లుపురంలో మెకానికల్‌ కోర్సులు, దిండివనంలో బీఈ సివిల్‌, మెకానికల్‌ కోర్సులు రద్దుచేశారు. అలాగే, అరియలూరు, పట్టుకోట కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో అందించే బీఈ సివిల్‌, మెకానికల్‌ కోర్సులు రద్దు చేశారు. గత కొన్నేళ్లుగా విద్యార్థుల తక్కువగా కోర్సులను రద్దు చేయాలని విద్యా కమిటీ తెలిపినా వర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ కోర్సులను తాత్కాలికంగా నిలిపివేయాలని వర్సిటీ నిర్ణయించింది. అదే సమయంలో నాలుగేళ్లుగా తిరుకువనై, రామనాధపురం కళాశాలల్లో మాత్రం 26 శాతం, 22 శాతం విద్యార్థులు చేరారు. ఈ నేపథ్యంలో, ఈ ఏడాదిలో సంబంఽధిత కళాశాలల్లో తమిళ మాధ్యమం బీఈ సివిల్‌, మెకానికల్‌ కోర్సులు నిలిపివేసి, విద్యార్థుల సౌకర్యార్ధం వృత్తి విద్యతో కూడిన కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని విద్యా కమిటీ సూచించింది. విద్యా కమిటీ ఆలోచనలకు విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, అన్నా విశ్వవిద్యాలయ ఉపకులపతి గురువారం విలేఖరులతో మాట్లాడుతూ... తమ విశ్వవిద్యాలయ పరిధిలో 16 అనుబంధ కళాశాలున్నాయన్నారు. వీటిలో పదిమంది కంటే తక్కువ విద్యార్థులున్న కోర్సులను నిలిపివేయాలని సిండికేట్‌ సమావేశం నిర్ణయించిందన్నారు. తమిళ మాధ్యమంలోని కోర్సులను మాత్రమే నిలిపివేయాలనే ఉద్దేశం లేదని, ఆంగ్ల మాధ్యమంలోని సివిల్‌, మెకానికల్‌ కోర్సుల్లోనూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. కానీ, ఈ విషయమై ఉన్నత విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు నిలిపివేయాలనే ఆలోచన విరమించుకున్నట్లు ఉప కులపతి వేల్‌రాజ్‌ తెలిపారు.

Updated Date - 2023-05-26T09:29:17+05:30 IST