కన్నవాళ్లే ఊపిరి తీసేశారు.. 5 నెలల కూతురి వల్లే తన ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో..
ABN , First Publish Date - 2023-01-24T18:40:33+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమో అనే భయంతో దంపతులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. సంపాదన కోసం అభం శుభం తెలియని పసికందును బలి ఇచ్చేశారు. కన్న కూతుర్ని దారుణంగా చంపేశారు. రాజస్థాన్లోని (Rajasthan) బికనీర్లో ఈ పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమో అనే భయంతో ఆ దంపతులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. సంపాదన కోసం అభం శుభం తెలియని పసికందును బలి ఇచ్చేశారు. కన్న కూతుర్ని దారుణంగా చంపేశారు. రాజస్థాన్లోని (Rajasthan) బికనీర్లో ఈ పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఐదు నెలల చిన్నారిని కాలువలో పడేసి వెళ్లిపోయాడు. నిందితులైన తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు (Crime News).
బికనీర్లోని ఛత్తర్గఢ్కు చెందిన ఝన్వర్లాల్ స్కూల్ అసిస్టెంట్గా కాంట్రాక్ట్పై పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. అయితే రాజస్థాన్ నిబంధనల ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. ఝన్వర్ లాల్కు నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక కూతుర్ని అన్నయ్యకు దత్తతకు ఇచ్చేశాడు. ఐదు నెలల క్రితం అతడికి ఓ ఆడ బిడ్డ జన్మించింది. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఆ బిడ్డను చంపెయ్యాలని ఝన్వర్ లాల్, అతడి భార్య నిర్ణయించుకున్నారు (Parents killed Daughter for Government Job).
ఆదివారం సాయంత్రం బావమరిది ఇంటి నుంచి తిరిగి వెళ్తూ దారిలో ఉన్న ఇందిరా గాంధీ కెనాల్లోకి బాలికను విసిరేశారు. బాలికను కాలువలోకి విసిరేయడం చూసి కొందరు కేకలు వేయడంతో ఝన్వర్ లాల్ బైక్పై వెళ్లిపోయాడు. స్థానికులు బాలికను కాలువ నుంచి బయటకు తీశారు, కానీ అప్పటికే ఆ శిశువు మరణించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి ఝన్వర్ లాల్ దంపతులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసమే కూతుర్ని చంపేసినట్టు పోలీసుల ఎదుట ఝన్వర్ లాల్ అంగీకరించాడు.