సెన్సెక్స్ స్వల్ప లాభంతో సరి
ABN , First Publish Date - 2023-01-25T00:59:50+05:30 IST
ఈక్విటీ మార్కెట్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆటుపోట్లతో నడిచాయి. చివరికి ప్రారంభ లాభాలన్నింటినీ...
ముంబై: ఈక్విటీ మార్కెట్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆటుపోట్లతో నడిచాయి. చివరికి ప్రారంభ లాభాలన్నింటినీ పోగొట్టుకుని స్వల్పలాభంతో ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 61,266.06 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినా చివరికి 37.08 పాయింట్ల లాభంతో 60,978.75 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా 18,118.30 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో 15, నిఫ్టీలో 29 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మిడ్క్యా్పల కోసం కొత్త సూచీ ఆటమ్
సెబీ మాజీ చైర్మన్ దామోదరన్ నిర్వహణలోని ఐరావత్ ఇండైసెస్ ప్రైవేట్ లిమిటెడ్, డెసిమల్ పాయింట్ అనలిటిక్స్ ఉమ్మడిగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన 30 మిడ్క్యాప్ కంపెనీలతో ఆటమ్ (ఐరావత్ టచ్స్టోన్ మిడ్క్యాప్ సూచీ) పేరిట కొత్త ఇండెక్స్ను ప్రారంభించాయి. చక్కని నిర్వహణా సామర్థ్యాలున్న మిడ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సేవలందించడం లక్ష్యంగా ఈ సూచీని ప్రారంభించినట్టు దామోదరన్ తెలిపారు. భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం జాబితాలోని 130 కంపెనీల నుంచి ఆటమ్ సూచీకి 30 మిడ్క్యాప్ కంపెనీలను ఎంపిక చేసినట్లు చెప్పారు. దీంతో పాటుగా మిడ్క్యా్పలకు కార్పొరేట్ గవర్నెన్స్ సూచీని కూడా దామోదరన్ విడుదల చేశారు.