డీఎస్సీ–98 ఉపాధ్యాయ నియామకాలకు కదలిక
ABN , First Publish Date - 2023-01-25T23:42:05+05:30 IST
సెలక్షన్ జోన్లోకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యాయ ఉద్యోగాలను నష్టపోయిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి తాజాగా కదలిక వచ్చింది.
ఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 25 : సెలక్షన్ జోన్లోకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యాయ ఉద్యోగాలను నష్టపోయిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి తాజాగా కదలిక వచ్చింది. ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ–98 నోటిఫైడ్ పోస్టుల సంఖ్య, భర్తీచేసిన పోస్టులు, తదుపరి డీఎస్సీకి క్యారీ ఫార్వార్డ్ చేసిన పోస్టుల సంఖ్య తదితర వివరాలను తక్షణమే పంపాలని జిల్లా విద్యా శాఖకు ఆదేశాలు అందాయి. ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ–98 నియామకాల్లో మొత్తం 470 మంది అభ్యర్థులు నష్టపోగా, వీరికి కనీస వేతన స్కేలు (ఎంటీఎస్)పై నియమించేందుకు గత సెప్టెంబరులో రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఆ మేరకు సంబంధిత అభ్యర్థుల నుంచి ఎంటీఎస్పై పనిచేస్తామని అంగీకారాన్ని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీచర్ల బదిలీలు పూర్తయిన వెంటనే మిగిలిన వెకెన్సీల్లో డీఎస్సీ–98 నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించే అవకాశాలున్నాయి. అయితే డీఎస్సీ–2008 అభ్యర్థులను నియమించినట్టుగానే డీఎస్సీ–98 రిక్రూట్మెంట్లో నష్టపోయిన వారిని ఏటా పది నెలల ఉద్యోగ కాలపరిమితిపై రెన్యువల్ చేసేలా నియమి స్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం ఏటా విద్యాసంవత్సర ముగింపు రోజున తొలగించి, తిరిగి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం రోజున విధుల్లోకి తీసుకునేలా నియమించే అవకాశాలున్నాయి. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడలేదు.