వికటించిన పంచాయితీ
ABN , First Publish Date - 2023-02-07T00:27:05+05:30 IST
నూజివీడు మండలం అన్నవరం గ్రామ పరిధిలోని మామిడి తోటలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయాలపాలైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
నూజివీడు, ఫిబ్రవరి 6: నూజివీడు మండలం అన్నవరం గ్రామ పరిధిలోని మామిడి తోటలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయాలపాలైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఆగిరిపల్లి మండలం పొలసానపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ, నాగమణి దంపతుల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించటానికి కనసానపల్లి గ్రామానికి చెందిన కొందరు, అలాగే గన్నవరం మండలం బీబీ గూడెంకు చెందిన మరికొందరు, నూజివీడు మండలం అన్నవరం శివారు వెంకటాయపాలెం రోడ్డులో గల మామిడితోటలో సోమవారం రాత్రి సమావేశమై పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ పంచాయితీలో వాదోపవాదాలు పెరిగి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇరువర్గాలు రాళ్ళు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనలో కనసానపల్లి గ్రామానికి చెందిన కుంభా ఏసుదాసు, కుంభా జోజి, ఆగిరిపల్లికి చెందిన నాగరాజు, వడ్లమానుకు చెందిన పాలపర్తి వెంకటేశ్వరరావు, పాలపర్తి నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాల య్యాయి. మరి కొందరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను సోమవారం రాత్రి నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నూజివీడు రూరల్ ఎస్ఐ టి.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.